చంద్రబాబు అమాయకుడు: విష్ణు, అంతా గమనిస్తున్నారని నిప్పులు చెరిగిన హరిబాబు
అమరావతి/విశాఖపట్నం: బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చాలా అమాయకుడని, అందరినీ గుడ్డిగా నమ్మేస్తారని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలసిపోతాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
కొంతమంది టీడీపీ నేతలే ఆ పార్టీని వదిలి వెళ్లిపోతారన్నారు. అందుకే టీడీపీలో ఉంటామని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించాలన్నారు. మార్వాడీలపై కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు దారుణమని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. మార్వాడీలకు కళా వెంకట్రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం పూర్తి సహకారం అందించడం వల్లనే ఏపీలో అభివృద్ది వేగంగా సాగుతోందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం రూ.43వేల కోట్ల నిధులను అయిదేళ్లలో ఇస్తామని ముందుకు వచ్చిందన్నారు. ఏపీకి కేటాయించిన మిగిలిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఇది అదనమన్నారు.
టీడీపీ ధర్మపోరాటం, సాధికారమిత్ర, మహానాడు పేరుతో సభలను పెట్టి కేవలం ప్రధాని మోడీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి వారిని ఉద్రిక్తతల వైపుగా ప్రేరేపిస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నారన్నారు.
విభజన చట్టంలోని పొందుపర్చిన అంశాలను 85 శాతం వాస్తవ రూపం దాల్చాయన్నారు. కర్ణాటకలో కుమారస్వామి కొలువుదీరిన సందర్భంలో జరిగిన అంశాలన్నింటిని ప్రజలు గమనించారని, కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పుట్టిన టీడీపీ అదే పార్టీతో చెట్టాపట్టాలు వేసుకోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు.