రౌడీలను తీసుకొస్తారా, మీ పాత్ర ఉన్నట్లే, మేం నోరు విప్పితే: బాబుకు విష్ణు వార్నింగ్
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గూండాలను, రౌడీలను అద్దెకు తీసుకు వచ్చి టీడీపీ ధర్నాలు చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు.
Recommended Video
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే ఎమ్మెల్యే వాసుపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచుతామంటూ విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ధర్నా చేశారన్నారు.
ట్విస్ట్.. కర్నూలు రెండో రాజధానిగా ఓకే, కానీ: బీజేపీకి లోకేష్ దిమ్మతిరిగే షాక్
చంద్రబాబు మౌనంగా ఉంటే ఆయన ప్రోత్సాహం ఉన్నట్లే
తాము మిత్రధర్మం పాటిస్తున్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని విష్ణు కుమార్ రాజు అన్నారు. వాసిపల్లిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై చంద్రబాబు మౌనంగా ఉంటే ఆయన ప్రోత్సాహం ఉంటుందని భావించాల్సి ఉంటుందని చెప్పారు.
మేం నోరు తెరిస్తే చాలా చెప్పాల్సి ఉంటుంది
మేం నోరు తెరిస్తే చాలా చెప్పవలసి ఉంటుందని విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీలకు డబ్బులు ఇచ్చి కిరాయికి తీసుకు వచ్చి ధర్నాలు చేయించడం ఏమిటని మండిపడ్డారు. వారందరని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి డబ్బులిస్తే ఎవరినైనా మర్డర్ చేసే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
మిత్రధర్మం అంటూ మాటల యుద్ధం
కాగా, ఏపీకి సాయం, కేంద్ర బడ్జెట్, విభజన హామీలపై టీడీపీ, బీజేపీ నాయకులు మిత్రధర్మం అంటూనే ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. పార్లమెంటులో తగ్గొద్దని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచిస్తుండగా, ఏపీలో ఆయా నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా, బీజేపీ కూడా ఘాటుగా స్పందిస్తోంది.
విజయవాడ ఫ్లెక్సీపై బీజేపీ ఆగ్రహం
సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి మాణిక్యాల రావు, శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ.. మోడీ ఏమిటీ వివక్ష? అంటూ టీడీపీ నేత ఒకరు విజయవాడలోను, అమరావతిలోను పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలియజేశారు.
పదవి వదిలేస్తా
తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టే అమిత్ షా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారని, ఆయన హుందాగా వ్యవహరించి ఫోన్ చేస్తే, బీజేపీ బెదిరిపోయిందని, అందుకే ఫోన్ చేశారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. పార్టీ అధిష్టానం చెబితే ఎమ్మెల్సీ పదవి వదిలేసేందుకు సిద్ధమని సోము వీర్రాజు చెప్పారు.
మేం పాండవులం, మీరు కౌరవులు
తాము పాండవులమని, టీడీపీ కౌరవులు సోము వీర్రాజు అన్నారు. టీడీపీ నాయకులు దక్షిణ భారత దేశాన్ని వేరు చేయాలని, ఏపీని ప్రత్యేక దేశంగా చేయాలని మాట్లాడుతుంటే తప్పు లేదు గానీ, పేదోళ్లు తమకు రాయలసీమ కావాలంటే చిచ్చు పెడుతున్నారనడం ఎంత వరకు సబబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చినా అది మేం కట్టిన పన్నులే అంటున్నారని, చంద్రబాబు, మోడీ ప్రజలు కట్టిన పన్నులే తిరిగి ఇస్తారని వ్యాఖ్యానించారు. దీనికి రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ... మీరు సైంధవుడిలా కాకుండా, విభీషణుడిలా వ్యహరిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు. దానికి సోము వీర్రాజు స్పందిస్తూ... మేం పాండవుల్లా తక్కువ మందే ఉన్నామని, మీరు, మీడియా వారూ కలసి కౌరవుల్లా ఎక్కువ మంది ఉన్నారు. మీడియా సహకారం కూడా మీకే ఉందన్నారు.