మేం చెప్తే పవన్ కల్యాణ్, జగన్ ఎెందుకు వింటారు: విష్ణుకుమార్ రాజు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంపై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అఖిల పక్ష సమావేశానికి హాజరు కాని పార్టీలపై తెలుగుదేశం నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
పార్టీ నిర్ణయం ప్రకారం తాము సమావేశానికి హాజరు కాలేదని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసి అఖిల పక్ష సమావేశానికి తాము ఎలా వస్తామని ఆయన ప్రశ్నించారు
ఆ ప్రచారం అబద్ధం
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధినేత కల్యాణ్ బిజెపితో కుమ్మక్కయ్యారని టిడిపి నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు వైఎస్ జగన్ తాము చెప్తే ఎందుకు వింటారని ప్రశ్నించారు. తాము చెప్పిన మాట పవన్ కల్యాణ్ వింటారా అని ఆయన అడిగారు.
మేం చెప్తే వినరు...
తాము చెప్తే మంత్రి అచ్చెన్నాయుడే వినరని, వారెందుకు వింటారని విష్ణుకుమార్ రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుందని, అందులో తాము పాలు పంచుకోవాలని అనుకోవడం లేదని, అందుకే అఖిల పక్ష సమావేశానికి హాజరు కాలేదని అన్నారు.
టిడిపి ఆత్మరక్షణలో పడిపోయింది
గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తెలుగుదేశం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయిందని, ఎన్నో నాలుగేళ్లుగా ఉలుకు పలుకు లేని సిఎం చంద్రబాబు ఎన్నికల భయంతోనే అనూహ్యంగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మల్లాది విష్ణు అన్నారు.
చంద్రబాబు నిద్రపోతే జగన్ కలలోకి
చంద్రబాబు నిద్రపోతే ఇంతకాలం జగన్ కలలోకి వచ్చేవారని, కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వస్తున్నట్లు టిడిపి నేతల మాటలను బట్టి అర్థమవుతోందని మల్లాది విష్ణు అన్నారు. దమ్ముంటే టిడిపి నేతలు తాము చేసిన వ్యాఖ్యలకు చర్చకు రావాలని చేసిన సవాల్కు తోకముడిచారని అన్నారు.
చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికే...
చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని మల్లాది విష్ణు అన్నారు. నాయకుల దిష్టిబొమ్మలు తగులబెడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని అన్నారు. శాంతిభద్రతలను ఏ విధంగా నిర్వహిస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని అడిగారు.
వారే కాళ్లు మొక్కారు...
అసెంబ్లీలో ఓ శాసనసభ్యుడు, మరో చోట ఎమ్మెల్సీ చంద్రబాబు కాళ్లు మొక్కారని మల్లాది విష్ణు అన్నారు. టిడిపి చేస్తున్న ఆరోపణలకు ఒకే ఒక్కడ విజయసాయి రెడ్డి సమాధానం చెప్పారని ఆయన అన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరితే తోక ముడిచారని ఆయన టిడిపి నేతలను ఉద్దేశించి అన్నారు
నాలుగేళ్లుగా ఇలా....
నాలుగేళ్ల పాటు బిజెపితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగి మోసపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ డిమాండును ప్రత్యేక హోదాగా మార్చేశారని మల్లాది విష్ణు అన్నారు దానికి జగన్ కారణమని అన్నారు. తమ పార్టీ పోరాటంతో దిగి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా అంటూ కొత్త రాగం అందుకున్నారని అన్నారు.