చూస్తే రెచ్చిపోయే బాలకృష్ణ, అనిత గురించి తెలిసే: బీజేపీ, మార్పు చేసుకొని మరీ బాబుతో గవర్నర్ భేటీ
విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం మండిపడ్డారు. మోడీపై ఆయన చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
Recommended Video
దిగొచ్చిన టీడీపీ: టీటీడీ పదవి నాకొద్దు.. బాబుకు అనిత లేఖ, ఆమే లేఖ రాయడం వెనుక
జనాలను చూస్తే రెచ్చిపోయే బాలకృష్ణ నోటికి వచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఇలా మాట్లాడటం దారుణం అన్నారు. బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
బాలకృష్ణ ఇష్యూ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్: వారించిన గవర్నర్, వివరాలకు బాబు నో, గంటన్నర భేటీ
ఒక్కరోజు దీక్షతో రూ.30 కోట్లు వృథా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షతో రూ.20 నుంచి రూ.30 కోట్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు. స్వార్థపూరిత ఆలోచనతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, ఆయన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పిందే చెబుతూ అందరికీ బోర్ కొట్టిస్తున్నారని, ఈసారి మాట్లాడేటప్పుడు ఒక ఆర్కెస్ట్రా కూడా పెట్టించాలని, అప్పుడు వినసొంపుగా ఉంటుందని ఎద్దేవా చేశారు.
గంటా శ్రీనివాస రావు అంత బరువు మోయాల్సిన అవసరం లేదు
విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విష్ణు కుమార్ రాజు స్పష్టం చేశారు. జోన్ తీసుకు వచ్చే బాధ్యతను తాను తన భుజస్కందాలపై వేసుకున్నానని మంత్రి గంటా శ్రీనివాస రావు చెబుతున్నారని, ఆయన అంత బరువు మోయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీయే ఇస్తుందన్నారు. ఈ నెల 30వ తేదీన చంద్రబాబు చేపట్టబోయే దీక్ష కూడా స్వార్థంతో కూడుకున్నదే అన్నారు.
వంగలపూడి అనిత గురించి తెలిసీ తీసుకున్నారు
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత క్రైస్తవురాలు అని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలోకి తీసుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు వేరుగా అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకయ్య నాయుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించారు
వంగలపూడి అనిత విషయంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు ఆ పదవికి ఆమె రాజీనామా చేశారని జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదన్నారు. అందుకే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పైన అభిశంసన తీర్మానం పెట్టారన్నారు. దానిని తిరస్కరించడం ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించారన్నారు.
పర్యటనలో మార్పు చేసుకొని మరీ
ఇదిలా ఉండగా, ఆదివారం గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఏకాంతంగా భేటీ అయిన విషయం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేంద్రంతో సఖ్యతతో ఉండాలని, మరీ వేడి పెంచుతున్నారని చంద్రబాబుకు గవర్నర్ హితబోధ చేశారని వార్తలు కూడా వచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చితే తమకు ఇబ్బంది లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, గవర్నర్ తన పర్యటనలో మార్పు చేసుకొని మరీ బాబును కలిశారు. విశాఖపట్నంలో రెడ్ క్రాస్ సొసైటీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ముగించుకుని నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సిన గవర్నర్ శనివారం తన పర్యటనలో మార్పులు చేసుకుని రైలులో బయల్దేరి రాత్రి 11.30 గంటల సమయంలో విజయవాడకు చేరుకున్నారు. గేట్ వే హోటల్లో బస చేశారు. ఆదివారం ఉదయం 11.15 గంటల సమయంలో చంద్రబాబు ఆ హోటల్కు వెళ్లి గవర్నరుతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం హోటల్ బయట వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ..ఇది పాత మిత్రుల సమావేశం మాత్రమేనని, ఎలాంటి ప్రాధాన్యత లేదని, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో ఆగానని చెప్పారు.