'పవన్ కళ్యాణ్ గాలి కూడా మారింది, అందుకే చంద్రబాబు పాలిష్, ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు'
విశాఖపట్నం/అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం ఖండించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పైన నిప్పులు చెరిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీ సత్తా చాటుతామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా కేంద్రంలో బీజేపీని ఏం చేయలేమని విపక్షాలను ఉద్దేశించి అన్నారు.
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: బాబుపై 'వ్యూహం' బెడిసికొట్టడంతో జగన్వైపు అడుగులు వేస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ను రెండింతలు పెంచడం కచ్చితంగా ఎన్నికల స్టంట్ అన్నారు. ఏపీలో బీజేపీ పుంజుకుంటుందని చెప్పారు. బీజేపీ చిన్న పార్టీ ఏమీ కాదని చెప్పారు. సభల పేరుతో టీడీపీ నేతలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ విమర్శలు తగ్గాయి, పవన్ గాలి మారింది
పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలు తగ్గినట్లుగా కనిపిస్తున్నాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. పవన్ గాలి కూడా కాస్త మారినట్లుగా కనిపిస్తోందని చెప్పారు. బీజేపీ (భారతీయ జనతా పార్టీ) అంటే బీజేపీ (బీ), జగన్ (జే), పవన్ కళ్యాణ్ (పీ) అని విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ను తీసివేశారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు.
పవన్ కళ్యాణ్ విషయంలో కొత్త ట్విస్టులు ఇస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇప్పుడు కొత్త ట్విస్టులు ఇస్తున్నారని విష్ణు కుమార్ రాజు అన్నారు. ఇలాంటి ట్విస్టులు, యూటర్న్లు అధికార తెలుగుదేశం పార్టీకి పెట్టింది పేరు అని మండిపడ్డారు. తనకు నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆ అనుభవాన్ని వాడాలో తెలుసునని చెప్పారు.
జనసేనతో చేతులు కలపడం వల్లే
అవసరమైనప్పుడల్లా చంద్రబాబు బీజేపీపై బురద చల్లుతూనే ఉన్నారని విష్ణు అన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని, ఎంతమంది ఎన్ని పొత్తులతో కలిసి వచ్చినా తమకు ఏమీ కాదన్నారు. బీజేపీ, జనసేనతో చేతులు కలపడం వల్లే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ చౌకబారు రాజకీయాలు చేయబోదన్నారు. టీడీపీ మాత్రం ఓట్ల కోసం, స్వార్థంతో రాజకీయాలు చేస్తోందన్నారు. ఏపీలో 20 లక్షల మందితో కాకుంటే కోటి మందితో టీడీపీ సభ పెట్టుకోవచ్చన్నారు.
పవన్ కళ్యాణ్ సాయం లేకుంటే గెలుపు కష్టమని చంద్రబాబు
గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ అనే పదంలో బీ అంటే బీజేపీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అని టీడీపీ నేతలు విమర్శించారని గుర్తు చేశారు. కానీ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాయం లేకుంటే గెలవడం కష్టమని చంద్రబాబు గుర్తించారన్నారు. అందుకే ఇప్పుడు జనసేనానికి పాలిష్ వేస్తున్నారన్నారు. అందుకే పవన్ను విమర్శించడం మానేసి ఆ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ను తీసుకొచ్చారన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ప్రజా తీర్పు రాబోతోందన్నారు. జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.