జగన్ యాత్ర చేస్తే, పవన్ నిలదీస్తే గుర్తుకొచ్చిందా, ఎన్టీఆర్ను ఏం చేశారో తెలుసు: బాబుపై విష్ణు
అమరావతి: బీజేపీపై వ్యతిరేకత వచ్చేలా సీఎం చంద్రబాబు మాటలు ఉన్నాయని విష్ణు కుమార్ రాజు అన్నారు. శాసన సభను రాజకీయ సభలా వాడుకున్నారని మండిపడ్డారు. జగన్ పాదయాత్ర చేస్తే కానీ టీడీపీకి ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
బీజేపీపై కుటిల ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం పెట్టి ప్రశ్నించగానే బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని టీడీపీకి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. 5 కోట్ల ప్రజల ఆత్మాభిమానం కోసం పోరాడిన ఎన్టీఆర్ను ఆ పార్టీ నాయకులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.
అసెంబ్లీ వేదికగా చెప్పిందే చెప్పి చంద్రబాబు ప్రజలను విసిగిస్తున్నారని విష్ణు కుమార్ అన్నారు. 29సార్లు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ప్రధాని 11సార్లు అపాయింటుమెంట్ ఇచ్చారని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లాల్సిన పని లేదన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొట్టేందుకే అఖిలపక్షం అన్నారు. విద్యార్థులను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విష్ణు మండిపడ్డారు.