వైసీపీ గ్రాఫ్ పెరిగింది, టీడీపీ ఓటమి ఖాయం: విష్ణు సంచలనం, జగన్ ఆగ్రహం
Recommended Video
విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా ఉన్నాయి.
విష్ణు మాట్లాడుతూ.. సీఎం నారా చంద్రబాబు చేస్తోన్న పోరాటం ధర్మ పోరాటం కాదని, అధర్మ పోరాటమని బుధవారం విమర్శించారు. జగన్ ఏం చెబితే చంద్రబాబు అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని గుర్తు చేశారు.
బాబు గ్రాఫ్ పడిపోయింది, వైసీపీ గ్రాఫ్ పెరిగింది
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని విష్ణు జోస్యం చెప్పారు. చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోయిందని, అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. అయితే, ఏ పార్టీ అయినా తమ పార్టీ గ్రాఫ్ గురించి మాట్లాడుకుంటుందని, కానీ విష్ణు.. జగన్ గ్రాఫ్ పెరిగిందని చెప్పడం గమనార్హం.
పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విష్ణు కుమార్ రాజు చెప్పారు. పొత్తు నిర్ణయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే 2019కి ముందు ఏ పార్టీతో పొత్తు లేకున్నప్పటికీ ఎన్నికల తర్వాత ఏదో ఒక పార్టీతో జత కడుతారని భావిస్తున్నారు.
ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేదు
దేశంలో పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఎవరికీ ఇవ్వలేదని విష్ణు కుమార్ రాజు అన్నారు. జగన్ హోదా నినాదం ఎత్తుకుంటే చంద్రబాబు ఎత్తుకున్నారన్నారు. ప్రజలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీపై జగన్ నిప్పులు
ఏపీని నాడు కాంగ్రెస్ పార్టీ విచక్షణారహితంగా విడగొట్టి అన్యాయం చేస్తే ఇప్పుడు బీజేపీ హోదా హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని జగన్ మండిపడ్డారు. 150వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో మంగళవారం జగన్ మాట్లాడారు. ఏపీలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. ఏపీకి సీఎం కాగానే చంద్రబాబు బెల్టు షాపులు రద్దు చేయిస్తామని మొదటి సంతకం పెట్టారని, కానీ నేడు ఊరూరా మాజీ ఎక్సైజ్శాఖ మంత్రే దగ్గరుండి వేలం వేయిస్తున్నారని ప్రజలు చెబుతున్నారన్నారు.
లిఖితపూర్వకంగా హామీ ఇస్తే మద్దతు
పొత్తులపై ఎవరి ప్రచారాలు నమ్మవద్దని, 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం తప్పనిసరిగా దిగి వస్తుందని జగన్ చెప్పారు. అప్పుడు హోదా దానంతట అదే వస్తుందన్నారు. ఏపీకి హోదా ఇస్తామని ఎవరు లిఖితపూర్వకంగా హామీ ఇస్తారో వారికే మద్దతు ఇస్తామన్నారు. భూముల విషయంలో టీడీపీ నేతలు చెప్పినట్లు వినలేదని నాలుగేళ్లుగా స్టేషన్లో పెట్టారని ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం బంధువు శివలీలమ్మ కన్నీంటి పర్యంతమయ్యారని చెప్పారు. ఇది బాబు పాలనకు నిదర్శనం అన్నారు.