గుడులపై దాడి జరిగితే చర్యలేవి.. అదే... విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శలు
రామతీర్థం ఆలయ ఘటన అగ్గిరాజేసింది. హిందువులు, ధార్మిక సంస్థలు భగ్గుమంటున్నాయి. బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రామతీర్థం ఘటన గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని అన్నారు. ఆయన ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.
ఇవే దాడులు చర్చిలపై జరిగి ఉంటే నిందితులను వెంటనే జైలుకు పంపేవారని ఆయన చెప్పారు. దేవాలయాల్లోకి అన్యమతస్థులు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. వైసీపీ వారే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరీ ఫిర్యాదులు ఎందుకు చేయడం లేదని విమర్శించారు. సీపీఐ నారాయణ ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు.
ఏపీ ప్రభుత్వంపై విష్ణు వర్ధన్ రెడ్డి మండిపడగా.. అంతకుముందు టీడీపీ పొలిట్ బ్యూరో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. జగన్ సర్కార్ను ఎండగట్టింది. ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఇదివరకు అంతర్వేదిలో రథం కూడా దగ్ధం అయిన సంగతి తెలిసిందే. తిరిగి రథం పున:ప్రతిష్టించబోతున్నారు. ఈ క్రమంలో రామతీర్థం ఆలయంపై దాడి ఘటన దుమారం రేపింది.