జగన్ను కలిశా, కానీ: రూ.50 కోట్లు ఇస్తేనే వైసిపి టిక్కెట్పై విష్ణు వర్ధన్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి టిక్కెట్ అడిగినట్లు, దానికి జగన్ రూ.50 కోట్లు ఉంటే టిక్కెట్ ఇస్తానని చెప్పినట్లుగా వచ్చిన వార్తలపై కావలి మాజీ ఎమ
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి టిక్కెట్ అడిగినట్లు, దానికి జగన్ రూ.50 కోట్లు ఉంటే టిక్కెట్ ఇస్తానని చెప్పినట్లుగా వచ్చిన వార్తలపై కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
జగన్ను కలిసింది నిజమే కానీ
జగన్ను కలిసి కావలి టిక్కెట్ అడిగింది నిజమేనని, కానీ తమ మధ్య రూ.50 కోట్ల ప్రస్తావన ఏదీ రాలేదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఒక దినపత్రికలో ఈ మేరకు కథనం వచ్చిందని, కానీ తమ మధ్య రూ.50 కోట్ల ప్రస్తావన రాలేదని వెల్లడించారు.
పార్టీ విషయాలు చర్చించుకున్నాం
ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసారు. ఈ నెల మొదట్లో హైదరాబాదులోని లోటస్ పాండులో జగన్తో కొద్దిసేపు పార్టీ విషయాలు మాట్లాడుకున్నామని, ఆ తర్వాత 2019లో జరగబోయే శాసన సభ ఎన్నికల టిక్కెట్లపై చర్చ జరిగిందన్నారు.
టైముందిగా అని జగన్ చెప్పారు
ఈ ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేస్తానని తాను జగన్కు చెప్పానని, ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అయితే ఇంకా సమయం ఉంది కదా, మళ్లీమాట్లాడుకుందామని కూడా జగన్ ఓ మాటగా చెప్పారని తెలిపారు. అంతే తప్ప తమ మధ్య డబ్బు విషయం, రూ.50 కోట్ల మాట ప్రస్తావనకు రాలేదన్నారు.
రూ.50 కోట్లు ఉంటే వైసిపి టిక్కెట్ అని ప్రచారం
13వ తేదీ శుక్రవారం ఓ దినపత్రికలో రూ.50 కోట్లు ఉంటేనే వైసిపి టిక్కెట్ అంటూ కథనం వచ్చిందని, దీనిని ఖండిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. తాము అంటే గిట్టనివాళ్లు అపోహలను సృష్టిస్తున్నారని, రూ.50 కోట్ల మాటల్లో ఇసుమంతైనా నిజం లేదని, ఇలాంటి కథనాలు ప్రచురించడం సరికాదన్నారు.