ఇన్ఫోసిస్ సహా అందరి మద్దతు: సిడ్నీ కేఫ్ ఘటనపై తెలుగు టెక్కీ
హైదరాబాద్: కష్టకాలంలో తనకు అన్ని వర్గాల నుండి చక్కటి మద్దతు లభించిందని ఆస్ట్రేలియా తీవ్రవాది చేతుల్లోంచి క్షేమంగా బయటపడ్డ తెలుగు సాఫ్టువేర్ ఇంజినీర్ విశ్వకాంత్ చెప్పారు. ముఖ్యంగా తన కంపెనీ ఇన్ఫోసిస్ యాజమాన్యం మద్దతుగా నిలిచిందన్నారు.
స్నేహితులు, సన్నిహితులు, ఆస్ట్రేలియా ప్రజలు, భారత ప్రభుత్వం నుండి చక్కటి మద్దతు వచ్చిందని చెప్పారు. జరిగిన సంఘటన నుండి తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. తాను క్షేమంగా బయటపడాలని అందరు కోరుకున్నారని, అందుకే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
ఆయన భారత ప్రధాని కార్యాలయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే, ప్రస్తుతానికి తనకు, తన కుటుంబానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల కేఫ్లో ఉగ్రవాది పలువురిని బందించిన విషయం సంచలనం రేపిన విషయం తెలిసిందే. బందీలను విడిపించేందుకు కమెండోలు చేపట్టిన ఆపరేషన్ దాదాపు పదహారు గంటల తర్వాత ముగిసింది. ఈ బందీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా టెక్కీ విశ్వకాంత్ అంకిరెడ్డి సహా బందీలను కమెండోలు విడిపించారు.
అంతకుముందే కొందరు పారిపోయారు. దాదాపు 16 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది. సిడ్నీ కేఫ్ ఆపరేషన్లో బాంబు డిస్పోజల్ రోబోట్ను ఉపయోగించారు. బందీలు ఉగ్రవాది నుంచి పారిపోతున్న దృశ్యాలను ఆస్ట్రేలియా టీవీలు ప్రసారం చేశాయి.