సంచలనం:టిటిడి ఛైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్ లేఖాస్త్రం
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించడంపై టిడిపి ప్రభుత్వాన్ని తప్పుబడుతూ విశ్వ హిందూ పరిషత్ లేఖాస్త్రం సంధించింది. ఒక క్రైస్తవ మతాభిమానికి ఈ పదవిని ఎలా కట్టబెడతారని విమర్శలు గుప్పిస్తూ విహెచ్పి తెలంగాణా విభాగం ఈ లేఖ విడుదల చేసింది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ విహెచ్పి, బిజెపి, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులే కాకుండా హిందూ మత అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ఇదంతా టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి కావాలని ఆడిస్తున్న నాటకమని తెలుగుదేశం మద్దతుదారులు అంటున్నారు. ఈ విషయంపై నేరుగా ఇక్కడి బిజెపి నేతలు ఆరోపిస్తే రాజకీయంగా తీసుకుంటారని, అందుకే తెలంగాణా విహెచ్పితో ఈ లేఖ విడుదల చేయించారని ఆరోపిస్తున్నారు.
టిటిడి ఛైర్మన్ పై...విహెచ్పి లేఖాస్త్రం...
టిటిడి ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణా విభాగం సంధించిన లేఖాస్త్రం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. టిటిడి ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించనున్నట్లు సుమారు 10 నెలల క్రితమే వార్తలు వెలువడగా ఆ సమాచారం బైటకు వచ్చిందో లేదో తొలుత ఆర్ ఎస్ ఎస్ మొదలుకొని వివిధ పీఠాధిపతులు విమర్శనాస్త్రాలు సంధించడం ఆరంభించారు. సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సంస్థలతో సన్నిహితమని, పలుమార్లు క్రిస్టియన్ సభలకు హాజరవడమే అందుకు రుజువని, హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్నవారికే ఈ పదవి కట్టబెట్టాలనేది వీరందరి వాదన.
పుట్టా సుధాకర్ యదవ్...స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్...
పేరు బైటకు వచ్చీరావడంతోనే విమర్శల తాకిడి మొదలైనా వాటన్నింటినీ తోసిరాజని చివరకు ఈ పుట్టా సుధాకర్ యాదవ్ కే సిఎం చంద్రబాబు టిటిడి ఛైర్మన్ పదవి కట్టబెట్టడానికి కారణం ఉంది. ఎపిలో కొన్ని జిల్లాలవారికే తప్ప రాష్ట్ర వాసులకు అంతగా తెలియని ఈ పుట్టా సుధాకర్ యాదవ్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే చాలా స్ట్రాంగే అని చెప్పక తప్పదు. ఏపీ మంత్రి యనమల, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ఈయన స్వయానా వియ్యంకుడు. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులుగా వ్యవహరిస్తున్న వారిద్దరి కుమార్తెలకు తన కుమారుల్ని ఇచ్చి పెళ్లి చేసిన సుధాకర్ యాదవ్ అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలో ఆ విధంగా తన హవా కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎవరెన్ని విమర్శలు చేసినా టిటిడి పదవి కోరుకున్నట్లుగానే ఆయన్నే వరించింది.
బిజెపితో కటీఫ్...పుట్టాకు లైన్ క్లియర్
పుట్టాకు టిటిడి ఛైర్మన్ పదవి అనగానే ముందు ఆర్ఎస్ఎస్, ఆ తరువాత హిందూ మత సంస్థలు, ఆ తరువాత బిజెపి విమర్శలు చేయడంతో ఆయనకు ఆ పదవి కట్టబెట్టే విషయంలో తాత్సారం చేసిన చంద్రబాబు ఎప్పుడైతే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారో ఇక తన రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా వేగంగా పావులు కదపడం, ప్రాధాన్యత ఇవ్వడం ముమ్మరం చేశారు. ఆ క్రమంలోనే మీరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అనే చందంగా...ఇంకా చెప్పాలంటే తాజా రాజకీయ పరిస్థితుల్లో బిజెపికి మరింత కిర్రెక్కించేలా పుట్టా సుధాకర్ యాదవ్ కు టిటిడి ఛైర్మన్ పదవి పిలిచి మరీ పట్టం కట్టారు.
ఆరోపణలు...ప్రత్యారోపణలు...
అయితే బిజెపి, టిడిపి శత్రు పక్షాలుగా మారిన క్రమంలో టిడిపిని రాజకీయంగా నష్టపరిచే లక్ష్యంతో బిజెపి ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందనేది టిడిపి మద్దతుదారుల ఆరోపణ. విహెచ్పి లేఖాస్త్రం చూస్తే అందులో టిడిపిని రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోందనేది టిడిపి శ్రేణులు అంటున్నాయి. సుధాకర్ రాజకీయ నిరుద్యోగి అని, ఎపి ముఖ్యమంత్రి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం టిటిడి బోర్టును వేదికగా చేసుకోవడం క్షమించరాని తప్పిదంగా విహెచ్పి తన లేఖలో పేర్కొంది. పుట్టా నియామకంతో ఇప్పటికే టిటిడిలో తిష్టవేసిన అన్యమత ఉద్యోగులు ఇంకా పెట్రేగిపోతారని పేర్కొంది. అంతేకాదు పుట్టా నియామకాన్ని వెంటనే విరమించుకోకుంటే కోటానుకోట్ల స్వామి వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించింది.
తాజా పరిణామాలతో...ఏం జరుగుతుంది...
విహెచ్ పి లేఖలో చివరగా తిరుమల తిరుపతి పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్ కార్యాచరణ ప్రకటించబోతోందని స్పష్టం చేసిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయమై సాధారణ భక్త జనంలో ఆందోళన రేకెత్తిస్తోంది. టిటిడి బోర్డ్ ఛైర్మన్ పదవిపై నెలకొన్న వివాదాలు చివరకు ఎటు దారితీస్తాయోననని వారు ఆందోలన చెందుతున్నారు. ఈ పదవిపై గతంలో భూమన కరుణాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి నియామకాలు అప్పుడు కూడా వివాదాలు చెలరేగిన విషయం రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. విహెచ్ పి కూడా పుట్టా నియామకం వల్లే టిటిడికి నష్టం వాటిల్లితుందంటూ వ్యవ్యస్థని కాకుండా వ్యక్తిని టార్గెట్ చేయడం తగదని, అదీ ఇలాంటి పరస్థితుల్లో అసలు తగదని వారు విశ్లేషిస్తున్నారు.