విషాదంలో వివేకా కేసు..! జగన్ హయాంలో కొలిక్కి వచ్చేనా..?
అమరావతి/హైదరాబాద్ : మాజీ మంత్రి మరియు వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న నేపథ్యంలో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ లను పులివెందుల సబ్ జైలు అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగించారు జిల్లా మేజిస్ట్రేట్. వైయస్ వివేకానంద రెడ్డిని గత మార్చి నెలలో హత్య చేసిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఏపిలో అదికారం మారింది కాబట్టి కేసు మునుముందు ఎలా ముందుకు వెళ్తుంది అనే అంశం పై ఆసక్తి నెలకొంది. సొంత బాబాయి కేసును సీయం జగన్ మోహన్ రెడ్డి ఎలా డీల్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వివేకా కేసు..! జగన్ ఏం చేయబోతున్నారు..!!
ఎన్నికల సమయంలో వైసీపీను తీవ్రంగా కుదిపేసిన సంఘటన వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య. మార్చి 15వ తేదీ జరిగిన హత్య.పై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సానుభూతి, కుటుంబ కక్షలతో జగన్ వర్గమే దీనికి తెగించిందని టీడీపీ ఆరొపించింది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు.. వైసీపీను ఇరుకున పెడతాయని టీడీపీ భావించింది. తమకు లాభం తెచ్చిపెడుతుందనుకున్నారు.
ఫాక్షన్ పడగ విప్పుతుందా..! అసలు ఫాక్షన్ లేకుండా పోతుందా..!!
కడపలో పసుపు జెండా రెపరెపలు ఖాయమనుకున్నారు. కానీ.. అన్నీ తలకిందులయ్యాయి. టీడీపీ గెలిస్తే.. కేసు విషయం ఎలా ఉండేదో కానీ.. జగన్ సీఎం కావటంతో బాబాయి మర్డర్పై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. వాస్తవాలను బయటకు తీసి.. హత్యకు కారణాలను ప్రపంచం ముందు ఉంచుతారా! లేకపోతే.. తాను కూడా బాబు దారిలోనే కక్ష సాధింపునకు పావుగా వాడుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇంతవరకూ సమీక్షలకే పరిమితమైన జగన్..! ఇతర వ్యవహారాలకు టైం కావాలంటున్న కొత్త సీయం..!!
మే 30న ప్రమాణస్వీకారం చేసిన జగన్ ఇప్పటికే పలు అంశాలపై సమీక్షలు జరిపారు. కొత్త డీజీపీగా సవాంగ్ ను నియమించారు. పాత పోలీసు అధికారులకు దాదాపు చరమగీతం పాడినట్టుగానే ప్రచారం సాగుతుంది. మరో కొద్ది రోజుల్లో జిల్లా ఎస్పీలను కూడా బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ తనపై జరిగిన కోడికత్తి దాడి, బాబాయి వివేకానందరెడ్డి హత్యలపై కూడా స్పందిస్తారని భావించారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు..! అబ్బాయి కార్యచరణ ఏ విధంగా ఉండబోతోంది..!!
అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ రెండింటిపై జగన్ పెదవి విప్పట్లేదంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే వివేకా మర్డర్ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. విచారణ జరిపిన అధికారులు కొందరు బదిలీ అయ్యారు. ఒకరిద్దరు సస్పెండ్ అయ్యారు. ఇంతటి కీలకమైన హత్య కేసు విషయంలో సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది అర్ధంకావట్లేదంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇదంతా చట్టం చేయాల్సిన పని కావటంతో పూర్తి స్వేచ్ఛను పోలీసులకు అప్పగించి అసలు దోషులను పట్టుకునేందుకు జగన్ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది.