వివేకా హత్య... ప్రాణం పోయే సమయంలో లెటర్ రాయటం సాధ్యమా ? లేఖ పై వైసీపీ నేతల అనుమానాలెన్నో!
Recommended Video
వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. వివేకా హత్యోదంతంపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలితో నరికి వివేకాను బెడ్ రూంలోనే చంపేసిన దుండగులు... దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు డెడ్ బాడీని బాత్ రూంలోకి తీసుకెళ్లారు. బాత్ రూంలో కమోడ్ తగిలి చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసిన దుండగులు గుట్టు చప్పుడు కాకుండా తప్పుకున్నారు. ఈ క్రమంలో తెల్లారిన తర్వాత హత్య వెలుగులోకి రాగా... వైఎస్ ఫ్యామిలీ షాక్ కు గురైంది .
గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్
రాజకీయ హత్యనా ? హత్యపై వైసీపీ , టీడీపీ ల మధ్య భిన్న వాదన
సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్యను రాజకీయ హత్యగా భావిస్తున్నారు వైసీపీ నేతలు. తన చిన్నాన్నను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని - నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీనిపై జగన్ డిమాండ్ కు ముందే అధికార టీడీపీ వివేకా హత్యను రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ ఎదురు దాడికి దిగింది. మంత్రులు - చివరకు సీఎం నారా చంద్రబాబునాయుడు సైతం తమదైన వాదనను వినిపించారు.హత్యపై దర్యాప్తుకు సిట్ ను వేసింది ఏపీ ప్రభుత్వం .
సంచలనంగా మారిన వివేకా లేఖ ..ప్రాణం పోతుంటే లేఖ రాశారా అంటూ వైసీపీ డౌట్
ఈ క్రమంలో వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ కొత్త చర్చకు తెరతీసింది . అసలు తనపై గొడ్డలితో కిరాతకంగా దాడి జరిగితే... స్వయంగా వివేకా లెటర్ ఎలా లేఖ రాశారన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వైసీపీ శ్రేణుల నుండి వినిపిస్తోంది. స్వయంగా జగన్ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాత్రి వేళ... ఇంటిలో ఒంటరిగా ఉన్న తనపై దుండగులు దాడికి దిగితే... దాడి తర్వాత వారు వెళ్లిపోయాక వివేకా లేఖ రాసినట్టుగా చెప్తున్న వాదన లో వాస్తవం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. . అసలు వివేకాపై దాడి చేసిన దుండగులు ఆయన చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాతే... డెడ్ బాడీని బాత్ రూంలోకి లాక్కెళ్లి... దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారన్న అభిప్రాయం వైసీపీ నేతల నుండి వ్యక్తం అవుతుంది.
కేసు తప్పు దారి పట్టించే యత్నంగా లెటర్ రాయించారా?
ఒకవేళ వివేకాపై దాడి చేసిన నిందితులు ఆయన మరణించకుండానే వెళ్లిపోయినా... గొడ్డలితో తన శరీరంపై తీవ్ర గాయాలు అయితే... ఆ గాయాల కారణంగా కలుగుతున్న తీవ్ర నొప్పిని తట్టుకుని , ప్రాణం పోయే స్థితిలో వివేకా లేఖ రాసేశారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . అయినా వివేకా రాసినట్టుగా చెబుతున్న సదరు లేఖలో వివేకా ఏం రాశారన్న విషయంలోకి వస్తే... *నా డ్రైవరు... నేను డ్యూటీకి తొందరగా నమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టొద్దు... ఇట్లు వివేకానందరెడ్డి* అని ఆ లేఖలో ఉన్నట్లుగా ఇటు పోలీసులతో పాటు అటు టీడీపీ సర్కారు చెబుతోంది. మరి ఈ లేఖను హంతకులే రాయించారా కేసును తప్పుదోవ పట్టించేందుకు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.