వివేకా హత్యకేసు విచారణ.. రంగంలోకి సీబీఐ కొత్త బృందం... కారణం ఇదే !!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదు . ఈ కేసును త్వరితగతిన తేల్చాలని ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఈ నేపధ్యంలో కొత్త బృందాన్ని రంగంలోకి దించుతుంది.
వివేకా కేసు విచారణాధికారులు ఏడుగురికి కరోనా
వైయస్ వివేకా హత్య కేసును విచారిస్తున్న విచారణ అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో, మిగతా అధికారులూ పరీక్షలు చేయించుకున్నారు. అయితే విచారణాదికారుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది . దీంతో వారంతా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. వారంతా మినిమం 14 రోజుల పాటు కరోనా తగ్గేవరకు విచారణ చెయ్యటానికి బయటకు వచ్చే వీలు లేని కారణంగా ఈ కేసు విచారణ బ్రేక్ పడకుండా కొత్త బృందం రంగంలోకి దిగుతుంది.
ఢిల్లీ నుండి కొత్త సీబీఐ అధికారుల బృందం
కరోనా కారణంగా ఇప్పటికే ఏడుగురు అధికారులు విచారణ చెయ్యలేని పరిస్థితి నెలకొనగా , నేటి నుంచి వివేకా హత్య కేసు విచారణ తిరిగి కొనసాగనున్నట్టు తెలుస్తుంది . వివేకా హత్య కేసు విచారణ కొనసాగింపునకుగాను అధికారులు కొత్త టీం ను ఏర్పాటు చేశారు. కొత్త సిబిఐ బృందం ఈరోజు ఢిల్లీ నుండి కడపకు చేరుకునే అవకాశముంది. సిబిఐ అధికారులు కడపకు చేరుకున్న తరువాత యథావిధిగా విచారణ కొనసాగనుంది. ఈ కేసు దర్యాప్తులో సిబిఐ ఎవరూ ఊహించని విధంగా కొత్త విషయాలను కొత్త వ్యక్తులను వెలుగులోకి తీసుకు వస్తుంది.
Recommended Video
సిట్ తరహాలోనే సీబీఐ విచారణలో జాప్యం .. త్వరగా తేల్చాలంటున్న వివేకా కుటుంబం
సిట్ తరహాలోనే ఈ కేసు దర్యాప్తును సిబిఐ కూడా సాగదీస్తుంది అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా సిబిఐ దర్యాప్తు ఎక్కువగా ఆర్ధిక, వ్యక్తిగత కారణాలు , లావాదేవీలపై జరుగుతోంది. అయితే గతంలో వివేకానంద రెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనేది ప్రధానంగా తెరమీదకు వచ్చింది. అప్పుడు ఈ కేసులో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ప్రధానంగా తెరమీదకు వచ్చాయి. అప్పుడు సిట్ దర్యాప్తు ఆ కోణంలోనే సాగింది. కానీ ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు ఎక్కువగా ఆర్థిక వ్యక్తిగత లావాదేవీలపై సాగుతుండడం గమనార్హం.
సీబీఐ విచారణలోనూ ఇప్పటివరకు వివేకానంద హత్యకు కారణం ఏమిటి అన్న దానిపై స్పష్టత రాకపోవటంతో వివేకా కుటుంబం తీవ్ర అసహనంలో ఉన్నారు . త్వరితగతిన ఈ కేసును తేల్చాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు .