వైఎస్ వివేకా హత్యకేసు.. వర్ల వ్యాఖ్యలపై సిట్ సీరియస్ .. నోటీసులు జారీ
వివేకా హత్య కేసు విషయంలో టిడిపి నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి. ఈ హత్య కేసులో నిందితులు ఎవరు సీఎం జగన్ కు తెలుసని, అసలు నేరస్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, డమ్మీ లను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్ల రామయ్య ఆరోపించారు . ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి హత్యకేసు మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని, కేసును సిబిఐకి ఎందుకు అప్పజెప్పడం లేదంటూ రామయ్య ప్రశ్నించారు . వర్ల చేసిన వ్యాఖ్యలపై బిజెపి గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. వివేకా హత్య కేసు పై ఊహాగానాలను ప్రచారం చేస్తే సహించబోమని తేల్చిచెప్పారు.
మీ జాతకం మొత్తం తెలుసు..అదుపులో ఉండండి: వర్ల రామయ్యకు పోలీసు అధికారుల సంఘం వార్నింగ్...!
వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో హత్య కేసును ప్రభావితం చేసేలా వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నోటీసులు జారీ చేస్తున్నట్లు గా ప్రకటించారు. ఇక దీంతో వైసీపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వర్ల రామయ్య కు నోటీసులు జారీ చేసింది. మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య మిస్టరీ పై సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసి దోషులు ఎవరో తేల్చే పనిలో బిజీగా ఉంది.
ఈ సమయంలో వర్ల చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు సంబంధించి ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే సిట్ ముందు హాజరు కావాలని వర్ల రామయ్య కు నోటీసులు జారీ చేశారు. కడప సిట్ పోలీసు అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 160 ఆధారంగా వర్ల రామయ్య కు నోటీసులు జారీ చేశారు. సిట్ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సాక్ష్యాలతో సహా సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వర్ల రామయ్య ఏం చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.