వివేకా హత్యకేసు ... సునీతను భయపెట్టాలని చూస్తున్నారా ? జగన్ పై వర్ల ఫైర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బాబాయి వై ఎస్ వివేకా హత్యకేసు విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసులో ఆయన కుమారై సునీత హైకోర్టును ఆశ్రయించిందంటే సోదరి సునీతకు సోదరుడు సీఎం జగన్పై నమ్మకం లేదని అర్థమవుతోందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఇక ఈ నేపధ్యంలో గతంలో సీబీఐ విచారణ కోరిన జగన్ ఇప్పుడు ఎవరిని కాపాడటానికి తాత్సారం చేస్తున్నాడని ఆయన ప్రశ్నించారు.
సీఎం జగన్ సోదరి కోరుతున్నా ఎందుకు జగన్ సీబీఐ విచారణకు అప్పగించటం లేదని వర్ల ప్రశ్నించారు. ఇక సీఎం జగన్ కు భయం పట్టుకుందని పేర్కొన్న వర్ల హైదరాబాద్లోని సునీత ఇంటి వద్ద అంత మంది పోలీసులు ఎందుకు ఉన్నారని నిలదీశారు. సునీతను భయపెట్టాలని జగన్ చూస్తున్నారా అని మరోసారి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమానికి కౌంటర్ ఉద్యమాలు సృష్టిస్తున్నారని, ప్రజలు వీధుల్లోకి వచ్చి తన్నుకుచచ్చేలా సీఎం సివిల్వార్ సృష్టిస్తున్నాడని వర్లరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక నిన్నటికి నిన్న జగన్ హైదరాబాద్ కు రహస్య పర్యటన చేస్తున్నారని, అందుకు కారణం ఏంటి అని పేర్కొన్న ఆయన సోదరి సునీతను రిట్ గురించి ప్రశ్నించటానికి వెళ్తున్నారా అని నిలదీశారు. ఇక వైఎస్ వివేకా హత్యకేసుపై ఎవరు మాట్లాడితే వారికి నోటీసులిస్తారా అని దుయ్యబట్టారు.