వివేకా హత్యకేసు.. జగన్ పై ప్రతిపక్షాలకు ఆయుధంగా .. వివేకా కుమార్తె సీబీఐ దర్యాప్తు పిటీషన్
ఏపీలో ఇప్పుడు వై ఎస్ వివేకా హత్యకేసు సీబీఐ విచారణకు ఆయన కుమార్తె కోరటం సంచలనంగా మారింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇంత కాలం అవుతున్నా తన బాబాయిని ఎవరు హతమార్చారో కనిపెట్టలేకపోవటంపై ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు ప్రతిపక్ష పార్టీలు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చెయ్యగా , తాజాగా వివేకానంద రెడ్డి కూతురు సునీత సిబీఐ విచారణకు అప్పీల్ చెయ్యటం ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు బలాన్నిచ్చింది .
వివేకా కేసు .. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరన్న ఆదినారాయణ రెడ్డి
సీబీఐ విచారణ జరిపించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్
మాజీ మంత్రి , సీఎం జగన్ బాబాయి వైయస్ వివేకా హత్య జరిగి ఇంతకాలం అవుతున్నా కేసులో మాత్రం ఏ పురోగతి లేదు. ఇంతకీ వై ఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు. ఎందుకు చంపారు అన్నది మిస్టరీగానే ఉంది . ఇప్పటివరకు కేసు ఎటూ తేలకపోవటంతో వైయస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఈ కేసుకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడం లేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు సునీత.
అనుమానితుల జాబితా ఇచ్చిన వివేకా కుమార్తె సునీత
కొందరిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆయా వ్యక్తుల పేర్ల జాబితాను తన ఫిర్యాదులో పేర్కొన్న ఆమె ఆ జాబితాలో.. వాచ్ మెన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేర్లను ఆమె ప్రస్తావించారు . వివేకా హత్య జరిగిన రోజున సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు, తమ సన్నిహితుల సూచనల మేరకు ఈ జాబితాను కోర్టుకు సునీత సమర్పించినట్టు సమాచారం.
జగన్ టార్గెట్ గా టీడీపీ నేతల మాటల దాడి
ఇక ఈ నేపధ్యంలో జగన్ అధికారం చేపట్టి ఇంత కాలం అయినా, గతంలో ఉన్న సిట్ ను మార్చి ఆ స్థానంలో కొత్తగా జగన్ సిట్ ను ఏర్పాటు చేసినా కేసులో పురోగతి లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుందని పేర్కొంటున్నారు టీడీపీ నేతలు. ఇక టీడీపీ నేత ఆలపాటి రాజా వైయస్ వివేకా హత్య కేసులో సిట్ అధికారులను మారుస్తున్నారని చెప్పారు. ఈ కేసు విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు.
సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని నిలదీస్తున్న టీడీపీ నేతలు
కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు బుద్దా వెంకన్న . వివేకా హత్యలో సీఎం జగన్ పాత్ర కూడా ఉందనేది ప్రజలకు అర్ధమవుతోందన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేసును పట్టించుకోవడం లేదని వివేకా కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. ఇంతకాలం అయినా వివేకా హత్య కేసులో దోషులను పట్టుకోలేకపోయారని, ఇంత జాప్యం జరుగుతుందంటే వైఎస్ భాస్కర్రెడ్డితో పాటు..జగన్ కూడా కుట్రదారులే అని బుద్దా వెంకన్న ఆరోపించారు.
చెల్లికే న్యాయం చేయలేని జగన్ ఇక రాష్ట్రానికేం న్యాయం చేస్తారని ఆగ్రహం
తన చెల్లికే న్యాయం చేయలేని జగన్ ఇక రాష్ట్రానికేం న్యాయం చేస్తారని టీడీపీ మహిళా నాయకురాలు అనూరాధ పేర్కొన్నారు. సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నాడు కేసు విషయంలో సీబీఐ విచారణ జరపాలని విపక్ష నేతగా జగన్ డిమాండ్ చేయలేదా? అని అనురాధ ప్రశ్నించారు. సిట్ అధికారులను మూడు సార్లు మార్చాల్సిన అవసరమేంటని ఆమె నిలదీశారు. వివేకా హత్యలో మీకు ప్రమేయం లేకుంటే.. సీబీఐ విచారణ వేయడానికి భయమెందుకు అని ప్రశ్నించారు అనూరాధ .
సీబీఐ విచారణ డిమాండ్ చేసిన కన్నా లక్ష్మీ నారాయణ
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా వివేకా హత్య కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యకేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దోషులను తప్పించి అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే పోలీసు అధికారులను బదిలీ చేస్తున్నారన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. వివేకా కుటుంబ సభ్యుల కంటే ముందే తాను సీఎంకు లేఖ రాశానని కన్నా వెల్లడించారు. పరిటాల రవి హత్యకేసు మాదిరిగా ఈ కేసును కూడా సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీ నారాయణ .