సోదరుడు సీఎం జగన్ ను కలిసిన వివేకా కుమార్తె సునీత .. వివేకా హత్యకేసుపై పోలీస్ బాస్ లకు జగన్ ఆదేశం
వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇంతకాలమైనా అసలు నిందితులను పట్టుకోవటంలో సిట్ విఫలం అయ్యిందన్న భావన ఏపీలో ఉంది. ఇక ఈ కేసుపై జగన్ దృష్టి సారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు. తన తండ్రి హత్యపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. బుధవారం నాడు తాడేపల్లిలోని జగన్ నివాసంలో భేటీ అయిన ఆమె అరగంట పాటు హత్యపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపధ్యంలోనే జగన్ పోలీస్ బాస్ లకు హత్య కేసు విచారణపై ఆదేశాలిచ్చారు.
విదేశీ పర్యటన వాయిదా వేసుకున్న చంద్రబాబు.. రీజన్ ఇదేనా ?
టీడీపీ హయాంలో వేసిన సిట్ విచారణపై అసంత్రిప్తి వ్యక్తం చేస్తున్న సునీత
వైయస్ వివేకానందరెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా బాబాయి. ఎన్నికలకు ముందు అంటే 2019 మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి కేసు విచారణ నిమిత్తం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను నియమించింది. వైయస్ వివేకానందరెడ్డి హత్యపై ఆనాటి ప్రభుత్వం వేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని సునీత మొదటి నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పునః విచారణ చేసి నేరస్థులకు శిక్ష పడేలా చెయ్యాలని కోరిన సునీత
ఈ నేపధ్యంలోనే ఆమె సోదరుడైన సీఎం వైయస్ జగన్ తో ఆ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. దర్యాప్తును మెుదటి నుంచి చేయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సిట్ దర్యాప్తు సంస్థ ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మరియు కుటుంబ సభ్యులు మాత్రం సిట్ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తన తండ్రి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పునః దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చెయ్యాలని కోరుతున్నారు.ఈ పరిణమాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా హత్యకేసులో అసలు హంతకులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన జగన్
సునీత కుటుంబానికి ధైర్యం చెప్పి, వార్ కుటుంబానికి పూర్తి సపోర్ట్ తానిస్తానని చెప్పిన జగన్ ఈ కేసుపై దృష్టి సారించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అసలు హంతకులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్ . ఈ మేరకు వైఎస్ జగన్ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు . ఇప్పటికి ఈ కేసులో ప్రస్తుతం వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరుడు దొండవాగు శంకర్, పనిమనిషి కుమారుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా వున్నారు. వివేకా కుమార్తె సునీత సైతం తన సోదరుడు జగన్ ను కలిసి, ఈ కేసులో అసలు హంతకులను బయట పెట్టాలని కోరిన నేపధ్యంలో జగన్ ఈ కేసు విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది.