ఇంట్రెస్టింగ్: రాజధానిగా విశాఖను 66 ఏళ్ల క్రితమే ప్రతిపాదించారు...చరిత్ర ఏం చెబుతోంది?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం కాకపుట్టిస్తోంది. ఇప్పటికే వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును పెట్టి ఆమోదింప చేయగా.. మండలిలో మాత్రం ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయితే విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నా ఈ ప్రతిపాదన 66 ఏళ్ల క్రితమే వచ్చిందని చరిత్ర చెబుతోంది.
66 ఏళ్ల క్రితమే విశాఖ రాజధానిగా ప్రతిపాదన
ఏపీ రాజధానిగా విశాఖ పేరు వినిపిస్తుండటంతో అందరి చూపూ ఈ మహానగరంపైనే పడింది. విశాఖను రాజధానిగా చేయాలని అధికారిక వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. ఈ క్రమంలోనే వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినప్పటికీ ...మండలిలో మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం చేశారు ఛైర్మెన్ షరీఫ్. దీంతో ఏం జరుగుతుందో అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక విశాఖపట్నం రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఈ నాటిది కాదు. పోర్టు సిటీని రాజధాని చేయాలని 66 ఏళ్ల క్రితమే ప్రతిపాదన తెరపైకొచ్చింది. 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక విశాఖను రాజధాని చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే నాటి పరిస్థితులు మరోలా ఉండేవి.
1953 నవంబర్ 30న అసెంబ్లీలో తీర్మానం
విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని 1953లోనే ప్రతిపాదించడం జరిగింది. నాటి అసెంబ్లీలో 30 నవంబర్ 1953లో విశాఖను రాజధానిగా రొక్కం లక్ష్మీ నరసింహ దొర అధికారిక తీర్మానంను ప్రవేశపెట్టారు. 1956 ఏప్రిల్ 1 వరకు కర్నూలు రాజధానిగానే కొనసాగిస్తూ ఆ తర్వాత రాజధానిని విశాఖపట్నంకు తరలించాలన్న చట్టసవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా రెండు ఓట్ల ఆధిక్యతతో బిల్లు నెగ్గినట్లు అప్పటి అసెంబ్లీ స్పీకర్ నల్లపాటి వెంకట్రామయ్య సభలో ప్రకటించారు. విశాఖను ఏపీ శాశ్వత రాజధానిగా ఉంచాలని అప్పటి ప్రధాన పత్రికలో కూడా వార్త వచ్చింది. డిసెంబర్ 1, 1953లో ఆంధ్రపత్రికలో దీనికి సంబంధించిన వార్త బ్యానర్ ఐటెంగా పబ్లిష్ అయ్యింది.
ఆంధ్రపత్రికలో ప్రచురితమైన కథనం
కర్నూలులో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులతో పాటు ఇతర సభ్యులు కూడా సభలో ఉన్నట్లు ఆ పత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ సమావేశాలకు స్పీకర్గా నల్లపాటి వెంకట్రామయ్య ఉన్నట్లు పత్రిక ప్రచురించింది. విశాఖను 1 ఏప్రిల్ 1954 నుంచి శాశ్వత రాజధానిగా ప్రకటించాలనే ప్రతిపాదనపై ముందుగా ఓటింగ్ జరిగినట్లు పత్రిక ప్రచురించింది. అయితే ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకించినట్లు పత్రిక కథనంలో ప్రచురించింది. ఆ తర్వాత రొక్కం నరసింహ దొర ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు వార్త ప్రచురితమైంది.
విశాలాంధ్ర ఏర్పాటు అయితే హైదరాబాద్ రాజధాని
మరో సభ్యులు లుకాలపు లక్షణ్ దాస్ కూడా మరో ప్రతిపాదనను ప్రవేశపెట్టగా దీన్ని సమర్థించారు కాంగ్రెస్ నేత కృష్ణమూర్తి. కర్నూలును 1 అక్టోబర్ 1956 వరకు రాజధానిగా కొనసాగిస్తూ ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన విశాఖపట్నంకు రాజధానిని తరలించాలనేది ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంకు అన్ని అర్హతలున్నాయని లక్ష్మణ్ దాస్ చెప్పారు. ఆ నగరం వాతావరణం, షిప్యార్డు, సహజవనరులతో విశాఖకు అన్ని అర్హతలున్నాయన్నారు.అయితే భాషాప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాల్సి వస్తే విశాఖపట్నం రాజధానిగా ఉండకూడదని ఆయన చెప్పారు. కర్నూలు వాసులు కూడా రాజధానిగా విశాఖకు అనుకూలంగా ఉన్నప్పటికీ... విశాలాంధ్ర ఏర్పాటు అయితే రాజధాని హైదరాబాదు చేయాలని ప్రతిపాదించారు.
2 ఓట్ల తేడాతో నెగ్గిన సవరణ బిల్లు
ఇక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదన 66 ఏళ్ల క్రితమే తెరపైకి వచ్చినప్పటికీ దురదృష్టం ఏంటంటే ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో కానీ ఇతర పాఠ్యాంశాల్లోగాని చేర్చకపోవడమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది అప్పటి ఆంధ్రపత్రిక ప్రచురించింది కాబట్టి ఇప్పటి తరం వాళ్లకు నాటి పరిస్థితులు బోధపడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నాటి అసెంబ్లీలో రొక్కం నరసింహ దొర ప్రవేశపెట్టిన బిల్లుకు 60 మంది అనుకూలంగా ఓటు వేయగా..58 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో రెండు ఓట్ల మెజార్టీతో బిల్లు పాస్ అయ్యింది.