డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభం..స్లోపాయిజన్ ఇస్తున్నారా..?
విశాఖపట్నం: నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో వాస్తవాలు వెలికితీయాలంటూ ఏపీ హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక కోర్టు ఆదేశాలు అందుకున్న సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా డాక్టర్ సుధాకర్పై విశాఖపట్నంలో చేయి చేసుకున్న పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వాధికారులపై కేసు నమోదు చేసింది.
Recommended Video
నిమ్మగడ్డకు తాత్కాలిక ఉపశమనం.. ఇక హైకోర్టుకు డాక్టర్ సుధాకర్..! అదే జరగనుందా..?
డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభం
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ విచారణ చేపట్టింది. ముందుగా సీబీఐ విశాఖ ఎస్పీ పుట్టా విమలాదిత్య పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీబీఐకి కేసును అప్పగిస్తూ డాక్టర్ సుధాకర్పై చేయిచేసుకున్న పోలీస్ సిబ్బందిపై కేసును నమోదు చేయడంతో పాటు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి 8 వారాల్లోగా నివేదిక తమ ముందు ఉంచాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఇక డాక్టర్ సుధాకర్ ఐదవ అడిషనల్ సివిల్ జడ్జి మరియు విశాఖ ఐదవ అడిషనల్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్లకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాసీబీఐ కేసులను నమోదు చేసింది.
తన కొడుక్కు స్లో పాయిజన్ ఇస్తున్నారన్న తల్లి
ఇదిలా ఉంటే సుధాకర్ తల్లి ఈ విషయంపై స్పందించారు. తన కొడుకును అన్యాయంగా హాస్పిటల్ పాలు చేసి పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకుకు స్లో పాయిజన్ చేస్తున్నారనే అనుమానం తనకు కలుగుతోందని చెప్పింది. మెంటల్ హాస్పిటల్లో అందిస్తున్న చికిత్సపై తనకు అనుమానాలున్నాయని చెప్పిన సుధాకర్ తల్లి కావేరీ బాయి... వెంటనే తన కొడుకును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేసింది. ఇక సీబీఐ విచారణతో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. విశాఖలో తమ పరువు తీసిన వారికి శిక్ష పడాలని సుధాకర్ తల్లి కావేరీ బాయ్ చెప్పింది.
ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా...
ఇదిలా ఉంటే కేవలం ప్రభుత్వాన్ని సర్జికల్ మాస్కులు ఇవ్వాలని అడిగినందుకే తనను సస్పెండ్ చేశారని సుధాకర్ వాపోయారు. తను మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పిన సుధాకర్ ఇలాంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్-19 ప్రమాదం బారిన తొందరగా పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ పరిస్థితులు చూసి సెలవు తీసుకోవాలని భావించినప్పటికీ ఎస్మా అమలులో ఉన్నందున అది సాధ్యపడలేదని చెప్పారు. ఇక ఆ తర్వాత మే 20న తన కొడుకు బైక్ను ఎవరో దొంగలించారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ తానేదో మహిళా కానిస్టేబుల్ చేయి పట్టుకున్నట్లు చిత్రీకరించారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెట్టి సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యేలా చూస్తామని పోలీసులు హెచ్చరించినట్లు డాక్టర్ సుధాకర్ చెప్పారు.
సీబీఐ నమోదు చేసిన కేసలో...
ఇక మే 16వ తేదీన అనకాపల్లిలోని ఆంధ్రా బ్యాంకులో రూ.10 లక్షలు డబ్బులు వేసేందుకు తన కారులో బయలు దేరగా.. తనను ఎవరో ఫాలో అవుతుండటం చూసి డబ్బులు దొంగలిస్తారేమో అన్న అనుమానంతో దారి మార్చినట్లు చెప్పారు. ఇంటికి వెళుతూ దారి మధ్యలో కారు ఆపినప్పుడు ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి తనను రెచ్చగొట్టారని చెప్పారు. తన కారు తాళాలు, మొబైల్ ఫోన్, పర్సు లాక్కున్నారని చెప్పారు. తాను ధరించిన షర్టును చించివేశారని చెప్పాడు. తన కారులో ఉన్న రూ.10 లక్షలు తీసుకుని కారులో మూడు మద్యం బాటిల్స్ పెట్టినట్లు తాను గమనించానని సుధాకర్ చెప్పుకొచ్చారు. ఇక సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో బైకు, రెండు మొబైల్ ఫోన్లు, కారు తాళాలు, రూ.10 లక్షల క్యాష్, పర్సు ఇతర ఏటీఎం కార్డులు డాక్టర్ సుధాకర్ నుంచి దొంగలించారంటూ ప్రస్తావించింది.