షాకింగ్: విశాఖ విషానికి బ్యాక్టీరియా తోడైతే.. మరో ఉత్పాతం తప్పదా? బాధితులు ఇళ్లకు వెళ్లేదెలా?
కరోనా వైరస్ విలయానికి బ్యాక్టీరియా కూడా తోడైతే ఆ ఉత్పాతం మాటలకందనంత స్థాయిలో ఉండొచ్చు. వైరస్లు కనీసం పరాన్నజీవులు, అంటే, మనుషుల కణాలే వాటికి ఆధారం. కానీ బ్యాక్టిరియాలు అలాకాదు, తమంతట తాముగా వృద్ధి చెందే ఆ సూక్ష్మక్రిములు ఇన్ఫెక్షన్లను వేగంగా వ్యాపింపజేస్తాయి. ఇలాంటి ప్రమాదం ఎల్జీ పాలిమర్స్ ప్లాంటు చుట్టుపక్కల గ్రామాల్లో తలెత్తే అవకాశమున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధిత గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో జంతు కళేబరాలను వెలికితీయలేకపోతున్నారు.
తాళాలు తీస్తేగానీ..
విశాఖ శివారు ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ విషవాయువు లీకైన ఘటనలో 12 మంది చనిపోగా, వందల మంది ఆస్పత్రులపాలయ్యారు. గ్యాస్ వ్యాపించిన ఐదు గ్రామాల్లో కొందరు అదే రోజు రాత్రి ఇళ్లకు తాళలు వేసి పరుగులు తీయగా, మిగతా వాళ్లను అధికారులే ఖాళీచేయించి, క్యాంపులకు తరలించారు. మొత్తంగా అక్కడి ఇళ్లన్నీ ప్రస్తుతం తాళాలు వేసున్నాయి. ఆయా గ్రామాల్లో.. రోడ్లపై, మురికికాలువల్లో, పంటపొలాల్లో.. ఇలా ఎక్కడపడితే అక్కడ జంతు కళేబరాలు లభిస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నప్పటికీ.. ఇళ్ల లోపల చనిపోయిన జీవాల గురించే సర్వత్రా ఆందోళన నెలకొంది. తాళాలు తీసిన తర్వాతగానీ ఏ ఇంట్లో ఏ కళేబరం ఉండిపోయిదో చెప్పలేని పరిస్థితి.
బ్యాక్టీరియా భయం..
స్టెరీన్ విషవాయువు ప్రభావానికి ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లో మనుషులతోపాటు బర్రెలు, ఆవులు, కుక్కలు, పిల్లులు మృత్యువాత పడ్డాయి. చివరికి బొరియల్లో దాక్కున్న ఎలుకలు, పాములు కూడా ఊపిరాడక బయటికొచ్చి నేలకొరిగాయి. గత నాలుగు రోజులుగా శుద్ధీకరణ పనులు చేస్తోన్న సిబ్బంది.. కంటికి కనిపించిన కళేబరాలను వేరే ప్రాంతాలకు తరలించి ఖననం చేస్తున్నారు. అయితే ఇళ్ల లోపల కూడా జంతువులు చనిపోయి ఉండొచ్చని, ఆ కళేబరాల నుంచి బ్యాక్టీరియా ఉద్భవిస్తే పరిస్థితి ఇంకాస్త ఆందోళనకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనుషులపై ఇలా.. మరి జంతువులు?
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో చనిపోయిన 12 మంది అతిదారుణమైన స్థితికి లోనయ్యారని పోస్ట్ మార్టం రిపోర్టుల్లో వెల్లడైంది. విషవాయువు పీల్చిన తర్వాత బాధితుల రక్తంలో ఆక్సిజన్ శాతం ఒక్కసారే పడిపోయిందని, శరీరంలో సున్నితమైన భాగాలపై గ్యాస్ తీవ్రంగా ప్రభావం చూపిందని, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్(కేజీహెచ్) ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. మానవ అవయవాలపై స్టెరీన్ ప్రభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపినట్లు అధికారులు చెప్పారు. మరి చనిపోయిన జంతువులపై స్టెరీన్ గ్యాస్ ఏ విధంగా ప్రభావం చూపి ఉంటుంది? వాటి అవయవాల్లో ఏ రకమైన మార్పులు వచ్చుండొచ్చు? ఆ మార్పులు బ్యాక్టీరియాకు మరింత బలం చేకూర్చుతాయా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు రానున్నాయి.
చెన్నైలో టెస్టులు..
ఏపీ పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం ఎల్జీ పాలిమర్స్ ప్లాంటు చుట్టుపక్కల గ్రామాల్లో చనిపోయిన జంతువుల్లో ఇప్పటిదాకా 34 కళేబరాలను మాత్రమే సేకరించగలిగారు. మరో 191 జీవాలకు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. చనిపోయిన జంతువుల నమూనాలను చెన్నైకి పంపి, అక్కడి ‘ఫార్మకో విజిలెన్స్ ల్యాబ్ ఫర్ యానిమల్ ఫీడ్ ఫుడ్ సేఫ్టీ'లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమగ్ర పరిశీలన అనంతరం పశువైద్య నిపుణులు చేసే సూచనల మేరకు.. బ్యాక్టీరియాలపై ఒక అవగాహన వచ్చే అవకాశముందని, రిపోర్టులను బట్టి ముందుకెళతామని అధికారులు తెలిపారు.
ఇళ్లకు వచ్చేదెప్పుడు?
స్టెరీన్ పిల్చి చనిపోయిన జంతువులు, క్రిమి కీటకాల నుంచి ఎలాంటి బ్యాక్టీరియాలు వస్తాయోననే సందేహం ఆందోళనకు గురిచేస్తున్నదని, తాళం వేసిన ఇళ్లు తెరుచుకున్న తర్వాతగానీ బ్యాక్టీరియాల ప్రభావాన్ని అధ్యయనం చేసే వీలుండదని నిపుణులు పేర్కొన్నారు. చెన్నై ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా ప్రభుత్వ సిబ్బందే ఇళ్లలోకి వెళ్లి కళేబరాలను తొలగించాలా, లేక గ్రామస్తులు తిరిగొచ్చిన తర్వాతే శుభ్రపర్చాలా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. చనిపోయిన మూగజీవాల తరలింపు, బతికున్నవాటికి చికిత్స అందించే విషయంలో ప్రభుత్వాధికారులకు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం పాలుపంచుకుంటున్నాయి.
Recommended Video
జనం వస్తే ఏం తాగుతారు?
ఎల్జీ పాలిమర్స్ ప్లాంటు చుట్టుపక్కల్లోని ఐదు గ్రామాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ, ఎల్జీ సిబ్బంది కలిసి విషవాయువు ప్రభావాన్ని నిర్మూలించే పనులు ముమ్మరంగా చేస్తున్నారు. సోమవారం నాటికి ట్యాంకర్ ఉష్ణోగ్రత అదుపులోకి వచ్చిందని, దీంతో స్టెరీన్ లీకేజీ దాదాపు ఆగిపోయిందనే రిపోర్టులు వచ్చాయి. ఒకవేళ ప్రజలు క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకొస్తే ఏం తాగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లోని వాటర్ బాడీస్ అన్నింటినీ విషప్రభావానికి లోనై ఉండొచ్చనే అనుమానాలన్నాయి. దీంతో అన్నింటినీ కచ్చితంగా శుద్ధి చేయాల్సిందేనని అధికారులు యోచిస్తున్నారు. ఏమాత్రం అలసత్వానికి పోకుండా, అన్నింటినీ పరిశీలించి, సేఫ్ అనుకున్న తర్వాతే గ్రామస్తుల్ని తిరిగి ఇళ్లకు పంపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.