vizag gas leak .. ఎన్జీటీ ఆదేశాలతో రూ.50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమర్స్
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ దుర్ఘటనపై హై పవర్ కమిటీని వేసి దర్యాప్తు సాగిస్తుంది. మరోపక్క ఎల్జీ పాలిమర్స్ సైతం తమ టాస్క్ ఫోర్సు బృందాన్ని పంపి దర్యాప్తు చేయిస్తుంది . అలాగే బాధితులను ఆదుకోవటానికి దీర్ఘ కాలిక ప్రణాళికలు రూపొందిస్తుంది . ఇక ఏపీ సర్కార్ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఎల్జీ పాలిమర్స్ లో ఉన్న స్టైరీన్ ను దక్షిణ కొరియాకు తరలించింది .
విశాఖకు చేరుకున్న ఎల్జీ పాలిమర్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ .. 8 మంది సభ్యులతో ఘటనపై విచారణ
ఈ ఘటనపై సీరియస్ గా ఉన్న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్
ఘటన జరిగిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ ఘటనపై వివరణ కోరుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చెయ్యటంతో పాటు ప్రాణ నష్టం కోసం రూ .50 కోట్ల మధ్యంతర మొత్తాన్ని డిపాజిట్ చెయ్యాలని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ బి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపి నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ కు మే 18 లోపు నివేదిక సమర్పించనుంది .
ఎన్జీటీ ఆదేశాలతో రూ. 50 కోట్లు డిపాజిట్ చేసిన ఎల్జీ పాలిమర్స్
దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ ఇండియా సంస్థ మే నెల7వ తేదీన జరిగిన విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటనకు సంబంధించి ఎన్జీటీ ఆదేశాల మేరకు స్పందించింది. ఆ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు జిల్లా కలెక్టర్ వినయ్చంద్ను కలిసి రూ.50 కోట్ల చెక్కును డిపాజిట్ చేశారు. ఎన్జిటి ఆదేశాల మేరకు పాలిమర్స్ యాజమాన్యం రూ.50 కోట్లు డిపాజిట్ చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు . ఈ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమచేశామన్నారు. తదుపరి ఎన్జిటి ఆదేశాల ప్రకారం వీటిని వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు .
Recommended Video
ఇంకా కోలుకోని విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితులు
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో పరిసర ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అస్వస్థతకు లోనై ఇంకా నరకం చూస్తున్నారు. ఇప్పటికే 12 మంది మృతి చెందగా, 350 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు ఈ ప్యాక్టరీ పరిసరాలలో ఉన్న అయిదు గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులలో జీవిస్తున్నారు. ఇక ఈ ఘటన నేపధ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఇలాంటి విష వాయువులు , కెమికల్స్ ఉన్న అన్ని పరిశ్రమలను తనిఖీ చేస్తున్నారు. ఇక ఎల్జీ పాలిమర్స్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.