విశాఖ లీకేజీ: ఆ చావులు భయానకం.. 12 మంది పోస్ట్మార్టమ్ రిపోర్ట్.. ఎల్జీపై కొత్త అనుమానాలు..
గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడెన్గా ఎవరో గొంతు పిసికేసినట్లు.. ముఖాన్ని ప్లాస్టిక్ కవర్తో చుట్టేసి ఊపిరాడనీయకుండా చేసినట్లు.. ఎంత ప్రయత్నించినా విదిలించుకోలేక.. ఇంకా అగాథంలోకి కూరుకుపోతున్నట్లు.. ఒంట్లో రక్తప్రసరణ నలిచిపోయినట్లు, ఒక్కో అవయవంపై పట్టుకోల్పోతున్నట్లు అర్థమయ్యేలోపే మృత్యుదేవత కబళింపు.. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులు చనిపోయిన తీరు తెలిస్తే ఎంత కఠినాత్ముడికైనా కన్నీళ్లురాక మానవు.
విశాఖ విషాదం: కేంద్రం సంచలన ఆదేశాలు.. రాష్ట్రాలకు వార్నింగ్.. టార్గెట్ అంటే తాటతీసుడేనట..
మరణాలకు కారణమిదే..
ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ విషవాయువు లీకైన దుర్ఘటనలో ఇప్పటిదాకా 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వేలాది మూగజీవాలు కూడా చనిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా, అదే రోజు మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. శనివారం నాటికే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కాగా, పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల్లో కీలక అంశాలు బయటపడ్డాయి. విషవాయువు పీల్చిన తర్వాత బాధితుల రక్తంలో ఆక్సిజన్ శాతం ఒక్కసారే పడిపోయిందని, దీంతో ఊపిరాడని స్థితిలో చనిపోయారని విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్(కేజీహెచ్) ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు.
ఆ భాగాలు పూర్తిగా..
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో చనిపోయిన 12 మందిలో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని, సున్నితమైన అవయవాలపై విషవాయువు తీవ్రంగా ప్రభావం చూపిందని డాక్టర్లు చెప్పారు. స్టెరీన్ ప్రభావాన్ని మరింత లోతుగా అంచనా వేసేందుకు మృతుల నుంచి సేకరించిన అవయవాలకు ఫోరెన్సిక్ ల్యాబ్లో మరిన్ని పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై కేంద్ర, రాష్ట్ర సంస్థలు విడివిడిగా విచారణ కమిటీల ఏర్పాటు, దర్యాప్తునకు ఆదేశాలు వెలువరించడం తెలిసిందే. తద్వారా ప్రమాదానికి సంబంధించి రాబోయేరోజుల్లో మరిన్ని అంశాలు వెలుగులోకి రానున్నాయి. ఈలోపే ఎల్జీపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
స్టెరీన్ వల్లే చనిపోయారా?
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ గ్యాస్ లీకైన కారణంగానే 12 మంది చనిపోయినట్లు ఇప్పటిదాకా చేస్తున్న ప్రకటనలో వాస్తవం లేకపోవచ్చని, స్టెరీన్ తోపాటు మరో గుర్తుతెలియని రసాయనం కలిసి ఉండటమే ఈ విషాదానికి కారణమని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాలిస్టెరీన్ తయారీలో స్టెరీన్ ను విరివిగా వాడుతుంటారని, ప్రపంచంలో ఇప్పటిదాకా స్టెరీన్ గ్యాస్ పీల్చడం వల్ల మనుషులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలేవీ జరగలేదని కెమికల్ నిపుణులు అంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ లో అసలేం జరిగిందో ప్రజలకు తెలియజెప్పాలని విశాఖలోని కార్మిక సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నారు.
ఆ పదార్థం ఏమై ఉంటుంది?
పొరపాటున మనుషులు స్టైరిన్ గ్యాస్ పీల్చితే.. కళ్లమంట, దురద, దద్దుర్లు, శ్వాస అందకపోవడం, మగత లాంటి సమస్యలు ఏర్పడతాయి. కానీ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పైగా, అధిక సాంద్రత ఉండే స్టైరిన్ గ్యాస్.. కిలీమీటరు దూరం కంటే ఎక్కువ వ్యాపించే అవకాశం లేదు, విశాఖలో మాత్రం అది అంతకుమించి దూరంలో ఉన్నవాళ్లు కూడా ప్రభావితమయ్యారు. అంటే, స్టెరీన్ కు తోడు ఇతర రసాయనాలేవో కలిసి ఉండొచ్చని రసాయన శాస్త్ర నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్ ప్రకటించేనాటికే ఎల్జీ పాలిమర్స్ లోని రెండు ట్యాంకుల్లో స్టెరీన్ నిల్వ ఉందని, బహుశా, అది రసాయనిక మార్పులు చెందకుండా ఉండేందుకు, వేరొక పదార్థాన్ని కలిపి ఉండొచ్చని, దాని ప్రభావం వల్లే ప్రజలు చనిపోయిన ఉంటారని ఆంధ్రా యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు.
Recommended Video
అంతా క్లియర్..
స్టెరీన్ గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన చేసింది. పరిశ్రమలో కార్యకలాపాలన్నీ క్లియర్ గా ఉన్నాయని, అనుకోని రీతిగా ప్రమాదం తలెత్తిందని ఆ సంస్థ తెలిపింది. స్టెరీన్ కు మరో కెమికల్ కూడా తోడైందన్న అనుమానాలపై ఎల్జీ పాలిమర్స్ వివరణ ఇవ్వాల్సిఉంది. ‘స్టైరిన్ యూనిట్కు అనుసంధానించిన శీతలీకరణ యూనిట్లో లోపమే దుర్ఘటనకు కారణం' అని విశాఖ కలెక్టర్ అధికారిక వివరణ ఇచ్చారు. దీనిపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఓ హైలెవల్ కమిటీని నియమించింది. విశాఖ ఘటన నేపథ్యంలో దేశంలోని మిగతా కెమికల్ ఫ్యాక్టరీలు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల రీఓపెనింగ్ పై కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.