విశాఖ గ్యాస్ లీకేజీ.. బాధితుల్లో పుట్టుకొస్తున్న కొత్త సమస్యలు..
విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన స్థానికులను ఇప్పటికీ భయపెడుతోంది. ఊహించని ఈ దుర్ఘటన తర్వాత.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. మరోవైపు విష వాయువు స్టైరిన్ ప్రభావానికి లోనై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
బాధితుల చర్మంపై బొబ్బలు,చిన్నారుల్లో జ్వరం,న్యుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత చర్మంపై దురద,మంట రావడం.. ఆ తర్వాత చర్మం కమిలిపోయి బొబ్బలు వస్తున్నాయి. దీంతో చర్మ వ్యాధుల నిపుణులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. కొందరు బాధితులు కనీసం ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అలాంటివారికి కిడ్నీ,కాలేయ పనితీరుకు సంబంధించిన వైద్య పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం.
విశాఖలో 11 మంది మృతి చెందగా 554 మంది బాధితులుగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో 52 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.1కోటి పరిహారం ప్రకటించారు. బాధితుల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వారికి కూడా పరిహారం ప్రకటించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది.