ఏ కులం వాళ్లు ఎంత భూమిచ్చారు? రాజధాని రైతుల కులం డేటా వెల్లడించే దమ్ముందా? సోమిరెడ్డి సవాల్
రాష్ట్రానికి సరిగ్గా సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని, అంతేతప్ప ఇందులో పక్షపాతంగానీ, స్వార్థంగానీ లేనేలేదని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అసలు రాజధానిని అమరావతి నుంచి వేరే చోటికి మార్చడానికి కనీసం ఒక్క కారణాన్నైనా సీఎం జగన్ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. మంగళవారం నెల్లూరు టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
కులాల పేరుతో కుట్రలా?
దేశంలో మొదటిసారి వేల మంది రైతులు ముందుకొచ్చి అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చారని.. అంతగొప్ప త్యాగానికి కులాలను అంటడట్టడం, కులం పేరుతో కుట్రలు చేయడం వైసీపీకి తగదని సోమిరెడ్డి హితవు పలికారు. ‘‘ప్రభుత్వానికి దమ్ముంటే.. రాజధానికి 33 వేల ఎకరాలిచ్చిన వాళ్లలో ఏ కులంవాళ్లు ఎంత మంది ఉన్నారో అఫీషియల్ డేటాను విడుదల చేయాలి. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఆరోపణలు మానేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలి''అని సవాలు విసిరారు.
వైజాగ్ లో చాలా ఎంజాయ్ చేశాం.. కానీ..
రాజధానిని అమరావతి నుంచి వైజాగ్ కు ఎందుకు తరలించాలనుకుంటున్నారో ఏ ఒక్కరికీ అర్థంకావడంలేదన్న మాజీ మంత్రి.. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, సోషల్ మీడియాలో వ్యక్తమవుతోన్న అభిప్రాయాల్ని సీఎం జగన్ ఒక్కసారైనా పరిశీలిస్తే మంచిదని సూచించారు. ‘‘వైజాగ్ చాలా మంచి సిటీ. మా అందరికీ ఇష్టమైంది కూడా. ఎప్పుడైనా అక్కడికెళితే చాలా ఎంజాయ్ చేస్తాం. ఒకటిరెడు రోజులు గడిపేసి తిరిగొస్తాం. దాన్ని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితికి ఇవాళ జగన్ దిగజారారు''అని సోమిరెడ్డి చెప్పారు.
సీమ నేతలూ.. ఒక్కసారి ఆలోచించండి..
వైసీపీకి చెందిన రాయలసీమ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని తరలింపుపై సీరియస్ గా పునరాలోచించాలని, ఏదైనా అర్జెంట్ పనిమీద వైజాగ్ వెళ్లాలంటే ఎలా సాధ్యమవుతుందో, ఎన్నిరోజులకు తిరిగొస్తామో ఆలోచించుకోవాలని చంద్రమోహన్ రెడ్డి సూచించారు. అమరావతిలో ఉన్న సచివాలం నుంచే పరిపాలన కొనసాగించాలని, నిర్మాణంలో ఉన్న భవనాలు, రోడ్లను వెంటనే పూర్తిచేయాలని కోరారు.
ప్రతిదానికి బాబే బాధ్యుడా?
రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా దానికి చంద్రబాబు నాయుడే బాధ్యుడు అనడం తప్ప వైసీపీ నేతలకు మరో మాట తెలియదని సోమిరెడ్డి విమర్శించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి ఘటనతో టీడీపీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. 85 శాతం అసెంబ్లీ స్థానాల్ని ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంపై జగన్ కక్షకట్టారని, ఇప్పటికే ఇన్వెస్టర్లు ఎవరుకూడా రాష్ట్రానికి రావడం లేదని , ఇది మంచి పరిణామం కాదని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.