ఆమెను చంపింది భర్తే..: అదే కారణం?, వీడిన వైజాగ్ హత్య మిస్టరీ
విశాఖపట్నం: విశాఖపట్నం కొత్తపాలెం శివారులో హత్యకు గురైన గుర్తు తెలియని మహిళ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. భర్తే హంతకుడని నిర్దారించారు. రెండో పెళ్లికి అడ్డు వస్తుందన్న కారణంతో అతనే ఆమెను హత్య చేసినట్టుగా చెప్పారు. మృతురాలికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో మిస్టరీని చేధించేందుకు ఆలస్యమైనట్టు తెలుస్తోంది.
మహిళ హత్య ఎవరా మహిళా?:
గుంటూరు జిల్లాకు చెందిన సుజాతకు గతంలో ఓ వ్యక్తితో పెళ్లయింది. అయితే కొన్నాళ్లకే అతని నుంచి విడాకులు తీసుకుని విశాఖపట్నం వచ్చేసింది. అక్కడే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో కొన్నాళ్లు పనిచేసింది. ఇదే క్రమంలో సతీష్ అనే ఓ ఫోటోగ్రాఫర్ తో పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన సతీష్.. చెప్పినట్టుగానే 2016 ఏప్రిల్ 2న సింహాచలం దేవస్థానంలో ఆమెను వివాహం చేసుకున్నాడు.
ఇద్దరి మధ్య విభేదాలు:
పెళ్లయిన కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు సతీష్ కి మరో యువతితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. దీంతో తాను కూడా రెండో పెళ్లి చేసుకుంటానని సుజాతతో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయాన్ని సుజాత.. వారు నివాసముంటున్న కాలనీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు అతన్ని మందలించినట్టు తెలుస్తోంది. అప్పటినుంచి ఇక సుజాతపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను హత్య చేసి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
ఆమెను నమ్మించి తీసుకెళ్లాడు:
ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలో.. ఇంటి యజమాని వారిని ఖాళీ చేయించాడు. అనంతరం సుజాత రామాటాకీస్ వద్ద ఉన్న ఓ వసతిగృహంలో చేరింది. ఇదే క్రమంలో ఈ నెల 3న అక్కడికెళ్లిన సతీష్.. సరదాగా బయటకు వెళ్దామంటూ ఆమెను బయటకు తీసుకెళ్లాడు. తొలుత జగదాంబ సెంటర్, ఆ తర్వాత బీచ్ కి వెళ్లిన ఇద్దరు.. ఆ తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమాకు వెళ్లేముందు తన పల్సర్ బైక్ లో ట్యాంక్ నిండుగా పెట్రోల్ కొట్టించాడు సతీష్.
అదే రోజు హత్య:
సినిమా అయిపోయాక... సుజాతను గోపాలపట్నంలోని తన ఫోటో స్టూడియోకి తీసుకెళ్లాడు. అక్కడినుంచి మళ్లీ బయటకు వెళ్దామంటూ అర్థారత్రి దాటాక కొత్తపాలెం శివారు ప్రాంతానికి సుజాతను తీసుకొచ్చాడు. అక్కడే ప్లాస్టిక్ తాడుతో ఆమె పీకను బిగించి హత్య చేశాడు. ఆపై బైక్ లోని పెట్రోలు తీసి ఆమెను తగలబెట్టాడు.
సుజాత హత్య విషయం 4వ తేదీనే బయటపడ్డా.. ఆమెకు సంబంధించి ఏ ఆచూకీ తెలియకపోవడంతో మిస్టరీ చేధించడం ఆలస్యమైంది. సుజాత కనిపించకపోయినా.. ఆమె ఉంటున్న వసతి గృహం సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం ఆ వసతి గృహానికి ఓ బోర్డు కూడా లేదు. సీసీ కెమెరాలు కూడా లేవు. అసలు దానికి అనుమతులే లేవని కూడా గుర్తించారు. దీంతో ఆ వసతి గృహం నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.