Vizag Gas Leak ఘటనలో కేంద్రం జోక్యం: ఉన్నపళంగా జగన్ సర్కార్ నిర్ణయం వెనుక
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను పుట్టించిన విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకోనుందా?, జగన్ ప్రభత్వం ఉద్దేశపూరకంగా కేంద్రం వైపు చూపులు సారించిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంపై చేపట్టిన దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం కల్పించాలని జగన్ సర్కార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నపళంగా కేంద్రం జోక్యాన్ని కోరాలని నిర్ణయించుకోవడానికి అనేక కారణాలు ఉన్నట్లు సమాచారం.
రిజల్ట్స్ డే: జగన్కు కొత్త తలనొప్పి: కరోనా కాలంలో వైసీపీ విజయోత్సవాలు.. వారం రోజుల పాటు
12 మందిని బలి తీసుకున్న గ్యాస్
విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజీ కావడం వల్ల 12 మంది మరణించిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆర్ఆర్ వెంకటాపురం సహా అయిదు గ్రామాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. పరిసర ప్రాంతాల్లో పచ్చని చెట్లు సైతం ఈ విష వాయువుల వల్ల మాడిపోయాయి. పదుల సంఖ్యలో మూగజీవాలు మరణించాయి. ఈ ఘటన అనంతరం ఎల్జీ పాలిమర్స్ను తరలించాలనే డిమాండ్ స్థానికుల నుంచి తరచూ వినిపిస్తోంది.
ఎన్కే ప్రసాద్ కమిటీలో..
గ్యాస్ లీకేజీ ఉదంతంపై దర్యాప్తు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సారథ్యంలో నియమించిన ఈ కమిటీ ప్రస్తుతం తన దర్యాప్తును కొనసాగిస్తోంది. నెలరోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవేన్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్చంద్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎల్జీ పాలిమర్స్ విదేశీ సంస్థ కావడం వల్లే..
ఎల్జీ పాలిమర్స్ విదేశీ సంస్థ. దక్షిణ కొరియాకు చెందిన సంస్థ అది. ఆ సంస్థ యాజమాన్యం అక్కడే ఉంటోంది. దర్యాప్తులో భాగంగా ఏదైనా సమాచారాన్ని గానీ, సంప్రదింపులను నిర్వహించడం గానీ చేయాల్సి రావడం తప్పనిసరి. కీలకమైన అంశం కావడం వల్ల ఈ విషయంలో అత్యున్నత కమిటీ సభ్యులు ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరపడానికి కేంద్రం అనుమతిని తీసుకోవాల్సి వస్తోంది. దీనితో తాము నేరుగా ఎల్జీ పాలిమర్స్ సంస్థ యజమానులతో సంప్రదింపులను జరపడం కంటే.. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ చర్యలను చేపట్టగలిగితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం.
Recommended Video
రాజకీయ కారణాలూ లేకపోలేదంటూ..
ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉదంతం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యాన్ని తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ ఆరోపిస్తున్నారు. సంస్థ యాజమాన్యాన్ని కపాడటానికి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందనీ విమర్శిస్తున్నారు. ఈ దర్యాప్తు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయడం వల్ల టీడీపీ నాయకుల ఆరోపణలకు కూడా చెక్ పెట్టేలా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రం జోక్యాన్ని కోరడం వల్ల తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేసినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.