డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో డ్యామేజ్ కంట్రోల్కు దిగిన ప్రభుత్వం: మళ్లీ ఉద్యోగం.. కానీ..!
అమరావతి: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియనిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వం మెట్టు దిగినట్టే కనిపిస్తోంది. డ్యామేజ్ కంట్రోల్కు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఆయనపై విధించిన సస్పెన్షన్ సాధ్యమైనంత త్వరగా ఎత్తేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఆయనకు ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో కొన్ని షరతులను విధించిందని చెబుతున్నారు.
బాగా తలంటిన ఐఎంఏ: డాక్టర్ సుధాకర్ అరెస్టుపై నిజ నిర్ధారణ కమిటీ ఏం తేల్చిందంటే?
క్షమాపణ చెబితే ఓకే..
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిజ నిర్ధారణ కమిటీ సిఫారసులకు లోబడి ఆయన ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడంతో పాటు తాను చేసిన తప్పును అంగీకరించాల్సి ఉంటుందని మెలిక పెట్టినట్లు సమాచారం. దీనికోసం ప్రభుత్వం ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రిని రంగంలోకి దించారని అంటున్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చర్యలన్నింటినీ ఆయనకు అప్పగించారని తెలుస్తోంది. అవి ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ షరతులకు, క్షమాపణ చెప్పడానికీ ఆయన అంగీకరిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
అరెస్టు విషయంలో వ్యవహరించి తీరు పట్ల..
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ను అరెస్టు చేసే విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఐఎంఏ సైతం దీన్ని తప్పు పట్టింది. ఈ ఉదయం హైకోర్టు మెట్లు ఎక్కింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేేఖను హైకోర్టు సుమోటోగా తీసుకుని ప్రభుత్వ చర్యను తప్పుపట్టిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దళిత కార్డును ప్రయోగించడం వల్ల అన్ని వర్గాల ప్రజల్లోకి ప్రభుత్వంపై వ్యతిరేక భావనను కలిగించడానికి కారణం కావడంలో టీడీపీ సక్సెస్ అయిందని చెబుతున్నారు.
దళిత వర్గాల్లో తప్పుడు సంకేతాలు..
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయం దళిత వర్గాల్లో తప్పుడు సంకేతాలను పంపించిందనే అభిప్రాయం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. దిద్దుబాటు చర్యలకు దిగక తప్పదంటూ క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల నుంచి అభిప్రాయపడ్డారని, దీనితో ప్రభుత్వం ఆయనతో రాయబారం నడిపించడానికి రంగంలోకి దిగిందని అంటున్నారు. దీనికోసం దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించిందనే అభిప్రాయం వైఎస్ఆర్సీపీ నేతల్లో వ్యక్తమౌతున్నట్లు సమాచారం.
Recommended Video
ఐఎంఏ సిఫారసుల మేరకు
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయంలో ఐఎంఏ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కొన్ని సిఫారసులను చేసింది. ఆయనపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తేయాలని సూచించింది. డాక్టర్ సుధాకర్ కూడా తన తప్పును తెలుసుకుని ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని పేర్కొంది. డాక్టర్ సుధాకర్ తల్లి సైతం అదే కోరుకుంటున్నారు. తమకు ఎలాంటి రాజకీయాలు అక్కర్లేదని, తన కుమారుడు ఇదివరకట్లా ఉద్యోగానికి వెళ్లాలని తాను కోరకుంటున్నానని చెబుతున్నారు. ఏ పార్టీతోనూ తమకు సంబంధాలు లేవని, రాజకీయాల కోసం సుధాకర్ను వాడుకున్నారని ఆమె వాపోతున్నారు. తమది రాజకీయ నేపథ్యం గల కుటుంబం కాదని స్పష్టం చేస్తున్నారు.