వైజాగ్ నాట్ ఫర్ సేల్: భూముల అమ్మకానికి నిరసనగా ఉద్యమిస్తోన్న విశాఖ: టీటీడీపై వెనక్కి తగ్గడంతో
విశాఖపట్నం: విశాఖపట్నంలో మరో ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. విశాఖపట్నంలో భూములను విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు క్రమంగా పురుడుపోసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ దీనికి సారథ్యాన్ని వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా దుమారానికి దారి తీసిన తిరుమల తిరుపతి దేవస్థానానికి నిర్ధరక ఆస్తుల అమ్మకాల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేయడాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇక విశాఖపట్నంలో కూడా ప్రభుత్వ భూములను కాపాడుకునే దిశగా బీజేపీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. దీనికి వైజాగ్ నాట్ ఫర్ సేల్ అని పేరు పెట్టింది.
బోరువెల్ హార్రర్: తెలంగాణలో మూడేళ్ల చిన్నారిని బలి తీసుకున్న బోరుబావి: 25 అడుగుల లోతులో
విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం విశాఖలో మూడు, గుంటూరులో ఆరు చోట్ల భూములను గుర్తించింది. వాటిని విక్రయించడానికి అవసరమైన ప్రక్రియను కూడా ఆరంభించింది. వాటిని విక్రయించడం వల్ల కనీసం 250 నుంచి 300 కోట్ల రూపాయలను ఆర్జించాలనేది ప్రభుత్వం లక్ష్యం. దీనికి అనుగుణంగా బిడ్డింగులను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్డింగులను దాఖలు చేయడానికి శుక్రవారం చివరి తేదీ.
దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. బీజేపీ ఉద్యమానికి పూనుకుంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశపూరకంగానే ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడానికి పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించడంలో భాగంగా తాము ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అంటున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Recommended Video
రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ చేసిన నిరసన దీక్షలు, తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగానే టీటీడీ ఆస్తుల అమ్మకాల వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. ఈ సారి కూడా విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల అమ్మకాల విషయంలో అధికార వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అలవికాని హమీలను ఇచ్చారని, వాటిని తీర్చలేక తలకిందులు అవుతున్నారని ఎద్దేవా చేశారు. నవరత్నాలను అమలు చేయడానికి ప్రభుత్వ భూములను అమ్మకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.