అక్కడ భయపడి, ఇక్కడ నాటకాలా? అమిత్ షాతో అదే చెప్పా: వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు
అమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఆదివారం ఉదయం వీడియో సందేశంలో పవన్ ఇలా స్పందించారు.
వైసీపీని ప్రజల నమ్మరు
'22 మంది వైసీపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే స్టీల్ ప్లాంటు కోసం ఏం చేస్తారో? మీ విధానం ఏమిటో? పార్లమెంట్ సాక్షిగా చెప్పాలన్నారు. ఢిల్లీలో మాట్లాడటానికి భయపడి... ఇక్కడ మాత్రం ఓట్లు కోసం నిరసన ప్రదర్శనలు చేస్తామంటే ప్రజలెవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు' అని అన్నారు పవన్ కళ్యాణ్.
వైజాగ్ స్టీల్ ప్లాంటే కాదు.. కేంద్ర నిర్ణయం అందుకే: పవన్ కళ్యాణ్
'కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కూడా తాకాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పరిశ్రమపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది కానీ, వ్యాపారాలు చేయదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1970ల నుంచి లైసెన్స్ రాజ్ విధానం వల్ల.. అనుకున్న విధంగా పరిశ్రమలు నడపలేక మూతపడటం. పరిశ్రమలకు సంబంధించిన భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదే తప్ప ... కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంటును మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసుకున్నది కాదు' అని జనసేనాని వివరించారు.
ప్రత్యేక దృష్టితో చూడమని అమిత్ షాకి చెప్పాను: పవన్ కళ్యాణ్
'ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో ఇదే విషయం చెప్పాను. దేశంలో ఉన్న అన్ని పరిశ్రమల్లాగే విశాఖ ఉక్కు పరిశ్రమను చూడవద్దని చెప్పాను. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్రుల ఆత్మగౌరవ అంశంగా చూడాలని విన్నవించాను. స్టీల్ ప్లాంటు కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాలు ఇప్పటికీ పరిహారం కోసం పోరాటం చేయడం, దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ పనులకు వెళ్లడం పోరాటయాత్ర సమయంలో చూశాను. అలాగే పరిశ్రమ కోసం చాలా మంది ఆత్మబలిదానాలు చేశారు. ఇలాంటి త్యాగాలతో ఈ పరిశ్రమ విశాఖలో ఏర్పడింది. ఇలాంటి పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడమని నేనే స్వయంగా అమిత్ షా చెప్పి, వినతిపత్రం ఇచ్చాను' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
22 మంది ఎంపీలను పెట్టుకుని రాష్ట్రంలో నిరసనలా?
'విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమాన్ని 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. ఏ త్యాగాలు చేస్తే పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మా వంతు కృషి మేము ఢిల్లీలో ఎలాగైతే చేస్తున్నామో... 22 ఎంపీలు ఉన్న మీరు కూడా పార్లమెంటులో దీనిపై మాట్లాడాలి. వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కోసం పైపైన మాటలు కాకుండా చిత్తశుద్దితో పోరాటం చేయాలి. పార్లమెంటులో మాట్లాడానికి 22 మంది ఎంపీలను పెట్టుకొని... రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తే ఏం ప్రయోజనం? రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ చెందిన 22 మంది ఎంపీలు, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంటు వేదికగా పోరాడండి. అప్పుడు ప్రజలు చూస్తారు, నమ్ముతారు. అది వదిలేసి రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేయడం ప్రజలకు నమ్మశక్యంగా లేదు' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
స్టీల్ ప్లాంట్పై ప్రజల మాటే మా మాట: పవన్ కళ్యాణ్
'పార్లమెంటులో మేము లేము కాబట్టి రాష్ట్రంలో నిరసనలు తెలుపుతున్నాం. 22 మంది ఎంపీలను పెట్టుకొని బలమైన పార్లమెంట్ వ్యవస్థను వదిలేసి ఇక్కడకొచ్చి నిరసనలు తెలుపుతామంటే మీకు మాకు తేడా ఏముంది? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న మేమే హోంశాఖమంత్రితో బలంగా చెప్పగలిగాం. ఢిల్లీలో వదిలేసి విశాఖలో నిరసనలు చేయడం చూస్తుంటే వైసీపీకి చిత్తశుద్ధి లేదని నేను నమ్ముతున్నాను. వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే పార్లమెంటులో స్టీల్ ప్లాంటు గురించి మాట్లాడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో ప్రజలు కోరుకునే విధంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఇదే మా మాట. చివరి వరకు ఇదే మాట మీద ఉంటాం' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.