మేం సంపాదిస్తే..మీరు అమ్మేస్తున్నారు: దేశభక్తి పేరుతో విదేశీయుల చేతుల్లో: తులసీరెడ్డి
అమరావతి: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ వేడికి రగిల్చింది భారతీయ జనతా పార్టీ, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తోన్నాయి. ఈ విషయంలో ఒక్క రాజకీయ పార్టీ.. ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. బీజేపీని కూడా కాదని వైఎస్సార్సీపీని తెగనాడుతోంది తెలుగుదేశం పార్టీ. బీజేపీ, వైఎస్సార్సీపీ, టీడీపీలను దుయ్యబడుతోంది కాంగ్రెస్. ఈ మూడు పార్టీలు రాష్ట్రానికి పట్టిన పీడగా మండిపడుతోంది. బీజేపీ నేతలు దేశభక్తి పేరుతో అన్నీ అమ్మకానికి పెట్టిందంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
Recommended Video
మానవత్వమే మన మతం: ఇది యంగ్ ఇండియా: ప్రపంచం మొత్తం భారత్ వైపే: మోడీ
రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపై బీజేపీ నాయకులకు ఏ మాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా.. వెంటనే వారు తమ రాజీనామా చేయాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసీ రెడ్డి డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే తప్పుడు ఆలోచన చేస్తోన్న బీజేపీ నాయకులకు దేశం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. దేశభక్తి ముసుగులో అన్నీ ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి శనిలా దాపురించిందని, టీడీపీ. వైసీపీలు రాహుకేతువుల్లా మారయని మండిపడ్డారు.
దేశభక్తిపై పేటెంట్ హక్కును పొందినట్లు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశభక్తులమని చెప్పుకొంటూ దేశీయ కంపెనీలన్నింటినీ విదేశీయులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని.. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి విక్రయించడానికి ప్రతిపాదనలు చేయడం దేశభక్తి అనిపించుకోదని తులసీ రెడ్డి అన్నారు. 1971లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 1971లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయగా.. 2021లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కార్.. అదే స్టీల్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీలన్నీ లాభాల బాటలో సాగుతున్నాయని, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతకానితనం వల్లే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లిందని విమర్శించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం నెలకొల్పాల్సి ఉందని చెప్పారు. దాన్ని ఏర్పాటు చేయకపోగా.. ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్ముతోందని ధ్వజమెత్తారు. ఉన్నదీ పాయె.. లేనిది అసలు రాలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని తులసీ రెడ్డి విమర్శించారు.