విశాఖ ఉక్కు ప్రైవేటీకరఫై పవన్ కల్యాణ్ యూటర్న్: ఆ ఒక్క మాటతో
విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా భావిస్తోన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు.. రాజకీయాలను వేడెక్కించాయి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని విక్రయించాలనే ప్రతిపాదనలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే పోరుబాటను మొదలు పెట్టింది. వైసీపీ ఎంపీలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఇక భారతీయ జనతా పార్టీ--జనసేన కూటమి నేతలపై అందరి దృష్టీ పడింది. ఆ కూటమి వైఖరేమిటనేది కూడా తేలిపోయింది.
కేంద్రం మీదే వదిలేయడం పట్ల..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలంటూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున.. ఆ పార్టీ రాష్ట్రశాఖ నాయకులు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. పైగా ఎదురుదాడికి దిగుతున్నారు. 2019లో విశాఖ ఉక్కు పెట్టుబడుల ఉపసంహరణ విషయం మీద కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఇన్ని రోజులు ఎందుకు మౌనం పాటించారంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక, గ్రేటర్ విశాఖ మున్సిప్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ కూటమిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తునన్నాయంటూ మండిపడుతున్నారు.
పవన్ కల్యాణ్ మాట కూడా అదే..
బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన వైఖరి కూడా స్పష్టమైంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ గళం.. దేశ రాజధానిలో బీజేపీ పెద్దలను కలిసిన తరువాత మారిపోయింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వానిదే తుది నిర్ణయమంటూ తేల్చేశారాయన. కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ.. దాన్ని స్వాగతించడం మినహా మరో దారి కనిపించట్లేదనే అభిప్రాయం జనసేన నేతల్లో నెలకొంది. మిత్రపక్షం అయినందున- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడినట్టయింది.
అమిత్ షాతో భేటీ తరువాత..
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పవన్ కల్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ను కలిశారు. వారిని కలిసిన తరువాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై తన అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ మార్చుకున్నట్లు కనిపించింది. స్టీల్ ప్లాంట్పై తుది నిర్ణయం కేంద్రానిదేనని తేల్చేశారు. అమిత్ షాను కలిసిన తరువాత తమకు స్టీల్ ప్లాంట్పై స్పష్టత వచ్చిందని చెప్పడం.. ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో భాగంగానే పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోందని చెప్పారు.
యూటర్న్ తీసుకోవడం పట్ల
స్టీల్ ప్లాంట్ పునరాలోచన చేయాలని తాము చెప్పటం వరకేనని, తుది నిర్ణయాన్ని బీజేపీ కోర్ట్లోనే ఉందంటూ చెప్పడం.. పవన్ కల్యాణ్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని చెబుతూనే దాన్ని ప్రైవేటీకరించడానికి తనవంతు సహాయం అందించినట్టయిందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కనీస ప్రతిఘటన కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రైవేటీకరణను అడ్డుకునేలా పవన్ కల్యాణ్ ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నాయి.