మళ్లీ చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్: వైసీపీపై అనూహ్య ఒత్తిడి: బంద్కు ఉమ్మడిగా
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు నిరసనగా కొద్దిరోజులుగా కొనసాగుతోన్న ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాలు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి బంద్కు మద్దతు పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్.. బంద్లో పాల్గొంటామని తెలిపాయి.
పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మండదా: తప్పు విష్ణుదే: తేల్చేసిన రఘురామ: విశాఖ రాజధాని ఉత్తుత్తిదే
సీపీఐ, సీపీఎం సహా వాటి అనుబంధ సంఘాలు ఇదివరకే బంద్కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందంటూ ఆయా పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఇక బంతి వైసీపీ కోర్టులో పడినట్టయింది. రాష్ట్రస్థాయి బంద్కు మద్దతు తెలియజేయడంపై వైసీపీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంలో వైసీపీపై రాజకీయపరమైన ఒత్తిడి పెరిగింది.
బంద్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన చిత్తూరు జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. శుక్రవారం నాడే ఆయన చిత్తూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. దీన్ని ఆయన మరోరోజుకు వాయిదా వేసుకున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. అన్ని జిల్లాల పార్టీ నేతలు బంద్లో పాల్గొనాలని, బైక్ ర్యాలీలను నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. బంద్ను విజయవంతం చేయాలని అన్నారు.
రాష్ట్ర బంద్కు తాము మద్దతు ఇస్తున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ప్రతి ఆంధ్రుడు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. బంద్ను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల నిరసలను కేంద్రానికి తెలియజేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఉక్కు ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని చెప్పారు. యువత భవిష్యత్తును నాశనం చేసే అధికారం ప్రధాని మోడీకి లేదని, ఈ విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.