టీడీపీకి రిలీఫ్: విశాఖ ఎమ్మెల్యేలు హాజరు..కానీ.: విప్ ఇచ్చినా..ఆ ఇద్దరు రెబల్స్ మాత్రం..!
అమరావతి తరలింపు పైన ఆందోళనతో ఉన్న టీడీపీకి..విశాఖ ఎమ్మెల్యేలు మాత్రం కొంత రిలీఫ్ ఇచ్చారు. పార్టీ నుండి 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. వల్లభనేని వంశీ..మద్దాలి గిరి ఇద్దరూ టీడీపీకి దూరమయ్యారు. అయితే, అమావతి తరలింపును అడ్డుకుంటామని చెబుతున్న టీడీపీ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని..పార్టీ నిర్ణయానికి మద్దతుగా ఓటింగ్ చేయాలంటూ విప్ జారీ చేసింది. ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసారు.
అయితే, ఆదివారం జరిగిన టీడీపీ శాసనసభా పక్ష సమావేశానికి అయిదుగురు ఎమ్మెల్యేలు.. 12 మంది ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. దీంతో..టీడీపీలో టెన్షన్ కనిపించింది. వీరంతా టీడీపీతోనే ఉన్నారని..పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే, ఎట్టకేలకు టీడీఎల్పీ సమావేశానికి హాజరు కాని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు మాత్రం హాజరయ్యారు. కానీ, వారి విషయంలో మాత్రం ఇంకా టీడీపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది.
సభకు హాజరైన గంటా..వాసుపల్లి..
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు.. విశాఖలో పరిపాలనా రాజధాని నిర్ణయాన్ని విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగతించారు. గంటా..వాసుపల్లి గణేష్ లాంటి వారు దీనికి మద్దతుగా తీర్మానం చేసిన వారిలో ఉన్నారు. ఇక, ఈ రోజు ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని టీడీపీ విప్ జారీ చేసింది. ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో.. టీడీపీలో టెన్షన్ కనిపించింది. పార్టీలోని ముఖ్య నేతలు వారితో టచ్ లోకి వెళ్లారు.
సభకు వచ్చే వరకూ టీడీపీలో వారి పైనే చర్చ సాగింది
తాము..పార్టీ సమావేశానికి హాజరు కావటం లేదని..అసెంబ్లీకి వస్తామంటూ సమాచారం ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. అయినా.. వారు సభకు వచ్చే వరకూ టీడీపీలో వారి పైనే చర్చ సాగింది. కానీ, వారిద్దరూ సభకు హాజరవ్వటంతో పాటుగా టీడీపీ బెంచ్ ల్లోనే కూర్చుకున్నారు. కానీ, వారు సభలో ఒక వేళ రాజధానుల నిర్ణయం పైన డివిజన్ అవసరమైతే..విప్ కు కట్టుబడి ఉంటారా..లేక తమ ప్రాంతానికి పరిపాలనా రాజధాని కోసం నిలబడతారా అనే చర్చ కూడా లాబీల్లో జరుగుతోంది. దీంతో..ఇప్పుడు అందరూ వారి వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
రెబల్స్ మాత్రం ఇలా..
టీడీపీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ..మద్దాలి గిరి కి సైతం టీడీపీ విప్ జారీ చేసింది. వంశీ సభలో తనకు టీడీపీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్ధిగా పరిగణించాలని కోరారు. దీనికి స్పీకర్ సైతం సమ్మతించారు. టీడీపీ వంశీని సస్పెండ్ చేసింది. కానీ, నిబందనల ప్రకారం ఆయన టీడీపీ సభ్యుడుగానే ఉంటారని..పార్టీ విప్ పరిధిలోనే ఉంటారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం వంశీ ఇంకా టీడీపీ సభ్యుడుగానే ఉన్నారు. ఇక, మద్దాలి గిరి సైతం టీడీపీ సభ్యుడుగానే ఉన్నారు.
టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా
వీరిద్దరికీ పార్టీ విప్ జారీ చేసింది. వారు అసెంబ్లీకి హాజరు కాకపోయినా..ఒక వేళ సభ ల డివిజన్ జరిగి..టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారి పైన చర్యలకు వీలుగా టీడీపీ విప్ జారీ చేసింది. వారిద్దరూ సభకు హాజరైనా సభ లోపలకు మాత్రం రాలేదని తెలుస్తోంది. ఇక, టీడీఎల్పీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీలు 12 మంది హాజరు కాలేదు. దీని పైన సందేహాలు ఉన్నా.. వారంతా తమతోనే ఉన్నారని టీడీపీ చెబుతోంది. వారి వ్యవహారం పైన మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.