అందంగా లేనంటూ...యువకుడు ఆత్మహత్య:చేతిమీదే సూసైడ్ నోట్
విజయనగరం:అసలే అందంగా లేను...దానికితోడు సరైన ఉద్యోగం లేదు...మరి ఇక నాకు పిల్లనెవనిస్తారు?...పెళ్లెలా అవుతుంది?...ఈ ఆ యువకుడి మనోవేదన...దానికి తోడు వచ్చిన ఒకటీ రెండు సంబంధాలు కూడా కుదరకపోవడంతో చట్టుపక్కలవాళ్ల అవహేళన మాటలు మరింత కుంగదీశాయి.
దీంతో తాను బతికి ఉండటం వేస్ట్ అనుకున్నాడు. ఆ విషయమే చేతిమీద రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కోదుకరకవలసలో చోటుచేసుకుంది ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే...
విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం సాలూరు మండలం కోదుకరకవలసకు చెందిన మారోజు ధనుంజయ(25) అనే యువకుడి మృతదేహం గుర్తించారు. ఈ మృతదేహం రైలుపట్టాల పక్కనే పడి ఉంది. ఆ కుర్రాడి చేతిపై రాసి ఉన్న మ్యాటర్ చదివితే అతడు సూసైడ్ చేసుకున్నట్లు అర్థమైంది. తన చావుకు గల కారణాలు చేతిపై రాసుకోవడంతో పాటు ఆ సమాచారాన్ని సోదరుడు పరమేశ్వరరావుకు మొబైల్ లో మెసేజ్ కూడా పంపాడు.
మృతుడు ఐటీఐ, ఇంటర్ పూర్తిచేసి దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల గ్రామంలో పెళ్లి సంబంధం కోసం బంధువుల ఇంటికి వెళ్లగా ఆ సంబంధం కదరలేదు. దీంతో పాటు కొందరు తెలిసిన వ్యక్తులే "నీ ముఖం అద్దంలో చూసుకున్నావా" అంటూ ఎగతాళి చేయడంతో చాలా బాధపడినట్లు తెలుస్తోంది. పైగా ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్లినా అందరూ తిరస్కరిస్తుండటంతో అత్మన్యూనతాభావానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎంతో కష్టపడి పెంచిన కొడుకు ఎదిగొచ్చి ఆదుకుంటాడనుకుంటే ఇలా చేశాడని అతడి తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. దత్తిరాజేరు మండలం మానాపురానికి చెందిన కృష్ణ, సాలూరు మండలం జనవరివలసకు చెందిన అప్పయమ్మతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. ముగ్గురు పిల్లల తరువాత అప్పయమ్మ మృతిచెందింది. మరలా ఆయన అప్పయమ్మ చెల్లెలు గౌరమ్మను వివాహమాడాడు. వీరికి పాప, కుమారుడు. కొన్నాళ్లు జనవరివలసలో ఉండి, తరువాత కోదుకరకవలసకు వలస వచ్చారు. అక్కడ కృష్ణ, పాప మృతిచెందారు. దీంతో నలుగురు పిల్లలను కూలీ పనులు చేసి, పెంచింది గౌరమ్మ. ఒక కుమార్తె, కుమారుడు వివాహం చేసింది.
అయితే పేద కుటుంబంలో పుట్టిన ధనంజయ ఇంటర్మీడియట్, ఐటీఐ చదివాడు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో పాటు అందంగా లేననే భావన అతన్ని మనోవేదనకు గురిచేసింది. చివరిసారిగా బొబ్బిలిలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అన్నయ్య పరమేషుకు మొబైల్లో అందంగా లేను కాబట్టి చనిపోతున్నట్టు సమాచారం పంపించాడు. చేతి మీద సైతం ఇదే విషయం రాసుకున్నాడు. రైలు కింద పడి తనువు చాలించాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అతడి తల్లి గుండెలవిసేలా రోదిస్తుండటంతో చూసే వారి గుండె తరుక్కుపోతుంది.