బియాస్ నది ట్రాజెడీ: అండగా మేముంటాం (పిక్చర్స్)
హైదరాబాద్: బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థుల తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఎవరూ తీర్చలేరని ఆ కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారు తెలిపారు. విద్యార్థులు సభ్యులు అనిరుధ్, పవన్, కావ్య, రాజేష్, దీక్షిత్, శరత్ గురువారం సాయంత్రం కళాశాల ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
నదిలో కొట్టుకుపోయి మృతి చెందినట్టు నిర్ధారణ అయిన ఎ లక్ష్మీగాయత్రి, గంపల ఐశ్వర్య, ఆకుల విజేత, ఎండీ సాబేర్ హుస్సేన్, బానోతు రాంబాబు, దేవాశిష్బోస్, అరవింద్ కుమార్, ఉపేందర్ తదితరుల చిత్ర పటాలకు నివాళులర్పించారు. మృతి చెందిన విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
బియాస్ ట్రాజెడీ
ఈ నెల 21వ తేదీ సాయంత్రం నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇంకా ఆచూకీ దొరకని విద్యార్థులు ప్రాణాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
బియాస్ ట్రాజెడీ
మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదని అయితే వారికి అండగా ఉండటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
బియాస్ ట్రాజెడీ
బియాస్ నది వద్ద అక్కడి ప్రభుత్వం కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందని అభిప్రాయపడ్డారు. లార్జి డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో సైరన్ కూడా వినిపించకపోవటంతోనే విద్యార్థులు సకాలంలో అప్రమత్తమయ్యే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. ఈ లోపాలన్నింటినీ ఎత్తిచూపుతూ ప్రధానికి తాము లేఖ రాయనున్నట్టు తెలిపారు.
బియాస్ ట్రాజెడీ
కాగా, ఈ సమావేశంలో బియాస్ ట్రాజెడీ ప్రమాదంలో బయటపడి క్షేమంగా వచ్చిన సుహర్ష, రాఘవేంద్ర, నితిన్ తదితరులు పాల్గొన్నారు.