వలంటీర్లపైనా పోలీసు జులుం: విధి నిర్వహణలో లాఠీ దెబ్బలు: రాత్రివేళ మెరుపు ధర్నా..!
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అనుమానితులను వెదికి పట్టుకోవడం, వారి జాడలను కనుగొనడంలో గ్రామ, వార్డు వలంటీర్లు ఏ స్థాయిలో విధులను నిర్వర్తిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. లాక్డౌన్ అప్రకటిత కర్ఫ్యూ సమయంలో కూడా వారు ఇంటింటికీ వెళ్లి కరోనా వైరస్ అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచీ గానీ, పొరుగు రాష్ట్రాల నుంచి గానీ కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
వలంటీర్ల ద్వారా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మారుమూల గ్రామం నుంచి సైతం డేటా తెచ్చుకోగలుగుతోంది ఏపీ ప్రభుత్వం. అలాంటి వలంటీర్లకు కూాడా లాఠీ దెబ్బలు తప్పట్లేదు. విధి నిర్వహణలో పోలీసుల జులుంను ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఇంటింటికీ వెళ్లి హెల్త్ సర్వే నిర్వహిస్తోన్న తమపై పోలీసులు లాఠీఛార్జీ చేశారని కొందరు వలంటీర్లు ఆరోపిస్తున్నారు.
తాము వలంటీర్లమని, విధుల్లో ఉన్నామని చెబుతున్నప్పటికీ.. వినిపించుకోలేదని, లాఠీ దెబ్బలను రుచి చూపించారని విమర్శిస్తున్నారు. దీనికి నిరసనగా వలంటీర్లు రాత్రివేళ మెరుపు ధర్నాకు దిగారు. రాజమహేంద్రవరంలోని 6,7,8 వార్డుల గ్రామ సచివాలయ భవన సముదాయం వద్ద ధర్నాకు దిగారు. నిరసన ప్రదర్శన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. తమకు సరైన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఙప్తి చేశారు.
తెలంగాణలో కరోనా తీవ్రత: హైదరాబాద్లో అయిదు చోట్ల..జూబ్లీహిల్స్ అపోలో సహా: కేంద్రం కీలక నిర్ణయం..!
భద్రత కల్పించిన తరువాతే తాము హెల్త్ సర్వేలో పాల్గొంటామని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తాము పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తున్నామని, తమపై లాఠీఛార్జీ చేయడం సరికాదని అంటున్నారు. తమను ప్రశంసించడం కాదని, భద్రత కల్పించాలని, తమపై లాఠీ ఛార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారని చెబుతున్నారు.
వలంటీర్లపైనా పోలీసు జులుం: విధి నిర్వహణలో లాఠీ దెబ్బలు: రాత్రివేళ మెరుపు ధర్నా..!#coronavirusindia #Apgovt #YSJagan pic.twitter.com/a0Us29Ni8H
— Oneindia Telugu (@oneindiatelugu) March 27, 2020