వోల్వో ప్రమాదంపై హెచ్చార్సీకి: జెసి భార్యను ప్రశ్నిస్తారా?
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వద్దకు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు, దీనిపై మంగళవారం మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఇప్పటి వరకు ప్రమాద ఘటనపై సరైన విచారణ జరపలేదని చెప్పారు. మంత్రి వద్దకు వెళ్లిన తమ పట్ల అమానుషంగా అరెస్ట్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు హెచ్ఆర్సీకి విన్నవించారు. దీనిపై స్పందించిన కమిషన్ ఈనెల 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డిజిపికి ఆదేశాలు జారీ చేసింది.
రవాణా శాఖ తీరుపై శాసన సభ కమిటీ ఆగ్రహం
బస్సు దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయి బాధల్లో ఉన్న వారిపట్ల రవాణాశాఖ, పోలీసులు వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగాలేదని శాసన సభ అనుషంగిక చట్టాల కమిటీ ఆక్షేపించింది. దుర్ఘటన జరిగింది మన రాష్ట్రంలో, బాధితులు మన వారైనప్పుడు సంబంధింత శాఖలు వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా అని ప్రశ్నించింది.
మరోవైపు బస్సు ప్రమాద దుర్ఘటనపై ఎట్టకేలకు కదలిక మొదలైంది. ఈ ఘటనకు సంబంధించి బస్సు యజమానురాలిగా ఉన్న జెసి ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డిని కూడా బాధ్యురాలిగా చేర్చేందుకు సిఐడి రంగం సిద్ధం చేశారంటున్నారు. త్వరలోనే సిఐడి ఆమెను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు దివాకర్ ట్రావెల్స్దా? జబ్బార్ ట్రావెల్స్దా అన్న అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే.
అయితే, జెసి కుటుంబానికి చెందిన దివాకర్ రోడ్లైన్స్ పేరిట ఆ బస్సు అనంతపురం ఆర్డీయే కార్యాలయంలో రిజిస్టర్ అయింది. కొన్నాళ్లు తిప్పిన తర్వాత బస్సును బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్స్కు విక్రయించారు. విక్రయ అగ్రిమెంట్ రాసుకొన్న జబ్బార్ ట్రావెల్స్ అనంతపురం ఆర్టీయే అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుంది. బస్సు రిజిస్ట్రేషన్ను ఆంధ్రప్రదేశ్ ఆర్టీయే నుంచి కర్ణాటక ఆర్టీయేకు మార్చుకోవడానికి ఎన్వోసీలో ఆర్టీయే అధికారులు ఏడాది గడువు ఇచ్చారు.
కానీ, ప్రమాదం జరిగేనాటికి రెండేళ్లు దాటింది. అయినా, జబ్బార్ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్ను మార్చుకోలేదు. ఇందుకు కారణాలను సిఐడి అధికారులు ఆరా తీశారు. బస్సు ఫైనాన్స్లో ఉన్నందున వాయిదాల చెల్లింపు పూర్తి అయిన తర్వాతే వాహనాన్ని కర్ణాటకకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని విక్రయదారు చెప్పడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
అయితే ప్రమాదం జరిగే నాటికి బస్సు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్టు విభాగంలో దివాకర్ రోడ్లైన్స్ పేరిట రిజిస్టరై ఉండగా బస్సు మీద మాత్రం జబ్బార్ అని ఉంది. దీంతో, సాంకేతిక సమస్యంటూ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. కనీసం బాధ్యులను గుర్తించలేదు. దీంతో, బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.