ఓటుకు నోటును చట్టబద్ధం చేశారా? ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా ఓట్లను కొంటున్నారా?
ఎన్నికల ముంగిట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద అందరి దృష్టీ ఉంటుంది. అధికార పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుందనేది, ప్రతిపక్షపార్టీని ఢీ కొట్టడానికి ఎలా సన్నద్ధమైనదీ ఈ బడ్జెట్ సమావేశాల్లో తేటతెల్లమౌతుంది. ఎందుకంటే- అయిదేళ్ల పాటు అధికారంలో ఉండే రాజకీయ పార్టీకి అవే చివరి ఎన్నికలు. ఆ తరువాత అధికారంలోకి వస్తుందా? రాదా? అనే విషయం ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.
ఓటు ద్వారా ప్రజలు ఇచ్చే తీర్పును ప్రభావితం చేసేలా, అయిదేళ్లలో చేసిన తప్పులు ప్రజలు విస్మరించేలా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తుంది అధికార పార్టీ. ఓటర్లను ప్రభావితం చేయడానికి భారీ ఎత్తున వరాలు కురిపిస్తుంది. తాయిలాలను ఎరగా వేస్తుంది. తాత్కాలికంగా మభ్య పెట్టే ప్రయత్నాలను చేస్తుంది. బడ్జెట్ ఏ మాత్రం సహకరించకపోయినా, ఆకాశానికి నిచ్చెన వేస్తుంది అధికార పార్టీ.
అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే! ప్రాథమికంగా ఇదే సూత్రాన్ని అనుసరిస్తుంది. అధికారం చేతిలో ఉండటం వల్ల ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం అవకాశం కూడా ఇవ్వకుండా, వారు ప్రకటించిన హామీలను కూడా అమలు చేస్తామనే చెప్పుకొనే అవకాశం గానీ, వీలైతే చేసేయడానికి గానీ ఛాన్స్ ఉండటం అధికార పార్టీకి ప్లస్ పాయింట్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలను చూస్తే.. స్థూలంగా ఏర్పడే అభిప్రాయం ఇదే. కాకపోతే- ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఉందనే భయం, హామీల అమలులో జాప్యం చేశామా? అనే అనుమానం ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో కనిపించింది.
కాస్త ఘాటుగా చెప్పాలంటే నోటు కొట్టు, ఓటు పట్టు అనే రీతిలో సాగింది యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు. ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి నేల విడిచి సాము చేసిందా? అనే అభిప్రాయం తలెత్తుతుంది. కేంద్రం ఏమిచ్చింది? కేంద్రం నుంచి ఒక్క రూపాయి సహకారం అందలేదు? అని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాజాగా బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది ప్రశ్న.
ఒక్కమాటలో చెప్పాలంటే- అభివృద్ధి అనే మాటను పక్కన పెట్టింది. సంక్షేమం అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తొలి, మలి బడ్జెట్ తరువాత దాదాపుగా ఈ రంగాన్ని విస్మరించింది చంద్రబాబు సర్కార్. 2,26,177 కోట్ల రూపాయల బడ్జెట్లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల ముంగిట్లో సంక్షేమం అనే మాటను ఉచ్ఛరించడం ఎన్నికల జిమ్మిక్కేనని విశ్లేషకుల వాదన.
దీనికి కారణాలు లేకపోలేదు. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. వచ్చే నెల మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేసింది. అయిదేళ్ల పాటు 1000 రూపాయల పింఛన్ను ఇస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఎకాఎకిన ఈ మొత్తాన్ని 2000 రూపాయలు చేసింది. పింఛన్ల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 12,819 కోట్ల రూపాయలను కేటాయించారు.
నిరుద్యోగ భృతి విషయంలోనూ ఇదే చోటు చేసుకుంది. 1000 రూపాయల నిరుద్యోగ భృతి మొత్తాన్ని కూడా రెట్టింపు చేసింది. ప్రతినెలా రూ.2000 ఇస్తామని ప్రకటించింది. అసలు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసిందే ఆరు నెలల కిందట. పైగా ఇప్పుడు ఈ మొత్తాన్ని 2000 రూపాయలకు పెంచింది. దీనికోసం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఈ రకంగా అటు వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓట్లతో పాటు యువత ఓట్లకు గాలం వేసింది ప్రభుత్వం. నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో 1200 కోట్ల రూపాయలను కేటాయించారు.
ఇక మిగిలింది మహిళలు. వారి కోసం పసుపు-కుంకుమ పేరుతో మరో కొత్త పథకం. దీనికోసం బడ్జెట్లో 4000 కోట్ల రూపాయలను కేటాయించారు. పసుపు-కుంకుమ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రభుత్వం 2500 రూపాయల చెక్కులను అందజేస్తోంది.. అదీ పోస్ట్ డేటెడ్తో. మూడు దశల్లో 10,000 రూపాయల మొత్తాన్ని చెల్లిస్తుందట. అది కూడా గ్రాంట్గా కాదు. రూణ రూపంలో ఇస్తోంది. అంటే- ఈ మొత్తాన్ని తీసుకున్న మహిళలు దాన్ని మళ్లీ ప్రభుత్వానికి లేదా బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించక పోతే- బ్యాంకర్లు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది మనకు తెలిసిన విషయమే. ప్రతి రూపాయికీ వడ్డీ వేసి మరీ లాక్కుంటారు.
నిజానికి- 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. అదే స్కీమ్ను పేరు మార్చి, పసుపు-కుంకుమ అని సెంటిమెంట్ కలిసి వచ్చేలా నామకరణం చేసి అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే- 5000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కూడా రైతుల ఓటు బ్యాంకు కోసమే. దీనికితోడు- మరో ఆరు కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
దీన్ని బట్టి చూస్తే- కేవలం ఓట్ల కోసమే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించిందనేది స్పష్టమౌతోంది. సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని 2000 రూపాయల వరకు పెంచాలనే విషయం ప్రభుత్వానికి ఎన్నికల ముంగిట్లో గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు జనం. అధికారంలోకి వచ్చిన తొలి నాలుగేళ్లలో ఈ పని ఎందుకు చేయలేదని నిలదీస్తున్నారు. పైగా ఈ పథకం- ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటి. దీన్ని ప్రభుత్వం అచ్చంగా కాపీ కొట్టిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
నిరుద్యోగ భృతి కోసం నాలుగున్నరేళ్ల పాటు యువత ఎదురు చూసింది. ధర్నాలు, ఆందోళనలు చేసింది. అయినప్పటికీ.. పట్టించుకోలేదు. తీరా ఎన్నికలు సమీపించే సరికి 1000 రూపాయలు కాదు, 2000 ఇస్తామని ప్రకటించడం వెనుక ఏకైక అంతరార్థం- యువత ఓట్లే. నిరుద్యోగ భృతిని అమలు చేసే సమయంలోనే ఈ మొత్తాన్ని 2000 రూపాయలుగా ఎందుకు నిర్ధారించకూడదు? అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం దొరక్క పోవచ్చు. పసుపు-కుంకుమ పథకం కూడా అచ్చంగా మహిళల ఓట్ల కోసమే. రైతుల మీద చంద్రబాబుకు ప్రేమే ఉంటే అన్నదాతా సుఖీభవ పథకాన్ని అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఎందుకు అమలు చేయలేకపోయింది?
వాటన్నింటినీ బేరీజు వేసుకుంటే- చంద్రబాబు ప్రభుత్వానికి కావాల్సింది ఓట్లే తప్ప.. ప్రజల సంక్షేమం కాదనే విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు.. ఇలా ప్రతి వర్గాన్నీ చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తోందే తప్ప.. వారి సంక్షేమం కోసం పని చేయట్లేదని ప్రభుత్వం తనకు తానే వెల్లడించుకున్నట్టయింది. చిత్తశుధి అనేది ఉంటే ఆయా సంక్షేమ పథకాలన్నింటినీ అదికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే అమలు చేసి ఉండవచ్చంటూ ప్రతిపక్షం చేసే విమర్శల్లో నిజం ఉందనేలా ప్రవర్తిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పింఛన్, నిరుద్యోగ భృతి, పసుపు-కుంకుమ రూపంలో ఇదివరకే చెల్లిస్తోన్న మొత్తాన్ని పెంచి, ప్రభుత్వం డబ్బుతో అధికారంగా ఓట్లను కొనుగోలు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి.