వాట్సాప్లో సూసైడ్నోట్ పంపి...అదృశ్యమైన విఆర్వో...కలకలం...ఎక్కడంటే...
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఓ విఆర్వో మెసేజ్ కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఆ విఆర్వో వాట్సాప్ లో సూసైడ్ నోట్ పోస్ట్ చేసి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...
వానపల్లి వీఆర్వోగా పనిచేస్తున్న బి.సత్యనారాయణకు విధినిర్వహణకు సంబంధించి కొత్తపల్లి తహసీల్దార్ శ్రీధర్ తో విభేదాలు తలెత్తాయి. తనను తహసిల్దార్ వేధిస్తున్నాడంటూ సహచరులకు, కుటుంబ సభ్యులకు చెబుతూ వస్తున్న సత్యనారాయణ ఉన్నట్టుండి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తనను తహసిల్దార్ వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సత్యనారాయణ కలెక్టర్, ఆర్డీవో, సహచర వీఆర్వోలతో ఉన్న వాట్సాప్ గ్రూపులకు, స్నేహితులకు,కుటుంబ సభ్యులకు నాలుగు పేజీలతో ఉన్న లేఖ ప్రతులను ఫోటోలు తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే స్విఛ్ ఆఫ్ వస్తున్నట్లు తెలిసింది.
అయితే సత్యనారాయణ లేఖలో అనేక వివరాలు, ఫిర్యాదులు, డిమాండ్లు ఉన్నాయి. తాను సూసైడ్ లేఖలో పేర్కొన్న డిమాండ్లు అన్నిటిని అధికారులు రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే తన శవమే దొరుకుతుందని ఆ లేఖలో సత్యనారాయణ హెచ్చరించాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు, సహచర వీఆర్వోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సత్యనారాయణ ఆచూకి కోసం అన్వేషిస్తున్నారు.ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రెవిన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది.