గ్రామాల్లో పనిచేసే ఉద్యోగం అడిగా, ఇవ్వకుంటే రాజీనామా చేశా: లక్ష్మీనారాయణ
గుంటూరు: తాను గ్రామాలలో పని చేస్తానని ప్రభుత్వానికి చెప్పానని, కానీ అంగీకరించలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన వీఆర్ఎస్ బుధవారం ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఉద్యోగం వీడాక ఆయన గురువారం గుంటూరు జిల్లాలోని యాజలిలో రైతులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఏ రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదు, హోదా వస్తే ఉపాధి: లక్ష్మీనారాయణ
తాను గ్రామాల్లో పని చేస్తానని అడిగితే ప్రభుత్వం నో చెప్పిందని, కాబట్టి తాను గ్రామాల్లో పని చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని వెల్లడించారు. తాను ఐపీఎస్ కాబట్టి ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, రైతులకు మాత్రం ఇంక్రిమెంట్లు ఉండవన్నారు.
నేను వ్యవసాయ శాఖ మంత్రిని అయితే
నేను వ్యవసాయ శాఖ మంత్రిని అయితే మీ కోసం (రైతులు) ఏం చేయవచ్చునో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానని, అదే ఆలోచిస్తానని, వ్యవసాయ శాఖ మంత్రిగా కాకుంటే సామాజికవేత్తగా ఏం చేస్తానో ఆలోచిస్తానని లక్ష్మీనారాయణ అన్నారు. అన్నదాతలను మరిచిపోతే దేశానికి భవిష్యత్తు ఉండదని స్వామి వివేకానంద అన్నారని గుర్తు చేశారు. అన్నదాతలు బ్రహ్మాండంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు.
మార్పు కోసమే ప్రయత్నం
యాజలి ఒక గొప్ప ప్రదేశమని లక్ష్మీనారాయణ అన్నారు. ఇలాంటి ప్రదేశం నుంచి ఒక మార్పు కోసమే తన సంకల్పమని చెప్పారు. ఏ గ్రామంలో అయితే విద్య బాగుంటుందో అక్కడ యువత ముందడుగు వేస్తుందన్నారు. యాజలిలో యువకులు స్వచ్చంధంగా పాఠశాలను బాగుచేసుకున్నారని ప్రశంసించారు.
నేను అడిగిన ఉద్యోగం ఇవ్వలేదు
కష్టం, ఆనందం, ధైర్యం ఉండేవాడు రైతు అని లక్ష్మీనారాయణ అన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే తమ ప్రయత్మని చెప్పారు. రైతుల అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగం కావాలని మహారాష్ట్ర ప్రభుత్వాని కోరానని, నేను ఐపీఎస్ అయినందున ప్రభుత్వం తనకు అవకాశం కల్పించలేదన్నారు. అందుకే తాను ఉద్యోగం వదిలేసి రైతు సేవ కోసం బయటకు వచ్చానని చెప్పారు.
కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు
రైతులు సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని లక్ష్మీనారాయణ చెప్పారు. నాసిక్లో సామాజికవేత్త విలాస్ షిండే రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చే కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అక్కడి రైతులు తాము పండించిన పంటకు ధర నిర్ణయించేలా చైతన్యపరిచారన్నారు. రైతులకు విలాస్ షిండే ఇచ్చిన శక్తిని తెలుగు రైతులకు ఇవ్వాలని ఇక్కడకు వచ్చామని చెప్పారు. మంచి ప్రయత్నాలకు కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారని లక్ష్మీనారాయణ అన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు పండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
వీఆర్ఎస్ తర్వాత తొలి సామాజిక కార్యక్రమం
యాజలి గొప్ప ఖోఖో క్రీడాకారులను అందించిందని లక్ష్మీనారాయణ చెప్పారు. యాజిలి నుంచి నా యాగం ప్రారంభం చేస్తున్నానని, ఇది సంతోషమన్నారు .అంతా కలిసి పని చేస్తే సమాజంలో మార్పు తీసుకు రావడం సాధ్యమే అన్నారు. కాగా, వీఆర్ఎస్ తర్వాత లక్ష్మీనారాయణ తొలి సామాజిక కార్యక్రమం. ఆయన పాఠశాలలో మొక్క నాటారు.