గోతులు తీస్తే గోడలు కడితే కరోనా ఆగుతుందా .. మానవ జీవితాలకు కరోనా కంచె !!
లాక్ డౌన్ .. ఒకరి నుండి ఒకరికి కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకున్న కట్టడి చర్య .అయితే కరోనా లాక్ డౌన్ ప్రభావం దేశంలో ప్రతి ఒక్కరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారుస్తుంది. రాష్ట్రాల సరిహద్దుల్లోనూ, అలాగే గ్రామాలలోనూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కరోనా ఒక పక్క అన్నార్దుల ఆకలి తీర్చే మానవత్వాన్ని మేల్కొలుపుతుంటే, మరోపక్క పక్కవాడు ఏమైపోతే మాకేంటి అన్న స్వార్ధాన్ని కూడా పెంచుతుంది. కరోనా వ్యాపించకుండా ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వాలు చెప్తే అత్యవసర పనులకు కూడా వెళ్ళకుండా సరిహద్దుల్లో కంచెలు వేసి , గోతులు తీసి , ఏకంగా గోడలే కట్టి తీసుకుంటున్న చర్యలు చాలా మంది ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
కరోనా మహమ్మారి మానవ హక్కుల సంక్షోభంగా మారవచ్చు : ఐక్యరాజ్య సమితి హెచ్చరిక
కరోనాలాక్ డౌన్ ప్రభావం ... కంచెలు, కంపలు , గోతులు , రోడ్ బ్లాక్ లు
కరోనా కట్టడికి లాక్ డౌన్ మంచిదే . కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రజలను గుంపులుగా తిరగకుండా అడ్డుకోవటం కూడా మంచిదే . వారిలో అవగాహన కలిగించి వారు జాగ్రత్తగా ఉండేలా ప్రయత్నం చెయ్యాల్సిన ప్రభుత్వాలు చాలా సార్లు గ్రామాల్లోకి కొత్తవారు రాకుండా కంచెలు వేసి, చెట్లు నరికి రోడ్ కి అడ్డంగా వేసి, రోడ్స్ బ్లాక్ చేసి ఎవర్ని గ్రామాల నుండి బయటకు రాకుండా చేస్తే శభాష్ అన్నాయి. ఇక వారు చేసిన పని , కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్య అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్ళే ఎందరికో శాపంగా మారింది . అత్యవసరాలకు కూడా వెళ్ళలేని పరిస్థితులు చాలా మంది ఎదుర్కొన్నారు. కొందరి ప్రాణాలు ఇలాంటి చర్యలకు బలైపోయిన ఉదంతాలు ఉన్నాయి.
ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో గోతులు .. గర్భిణీకి నరక యాతన
ఇక కంచెలు, కంపల నుండి ఇప్పుడు గోతులు తియ్యటం , గోడలు కట్టటం దాకా లాక్ డౌన్ ప్రభావం పరిణామం చెందింది . నిన్నటికి నిన్న లాక్ డౌన్ వల్ల ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో రోడ్లపై గుంతలు తవ్వేసిన ఒరిస్సా అధికారుల నిర్వాకం వల్ల ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం అల్తీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తరలించే మార్గంలో గుంతలు ఉండటంతో అంబులెన్స్ నిలిచిపోయింది . దీంతో ఆమెను డోలి సహాయంతో మోసుకెళ్లి మిలగాం దాటించారు. అనంతరం అక్కడి నుంచి 108 అంబులెన్స్లో కొత్తూరు సామాజిక ఆసుపత్రిలో చేర్పించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే .
తమిళనాడు ఆంధ్రా సరిహద్దులో ఏకంగా గోడలు .. నిత్యావసరాలకు తిప్పలు
ఇక చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోడలను నిర్మించారు. ఇక ఈ చర్యతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. అయితే, అధికారుల తీరుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు.నిత్యావసరాలకు కూడా ఇబ్బందిగా ఉందని వారు వాపోతున్నారు.
ప్రజలను కట్టడి చెయ్యాలే తప్ప ఇలాంటి చర్యలతో ప్రయోజనం శూన్యం
ఇలా గోతులు తియ్యటం , కంచెలు వెయ్యటం , గోడలు కట్టటం మానవ మనుగడకు వేస్తున్న కంచెగా భావించాల్సిన పరిస్థితి. ప్రజలను ఇళ్ళ నుండి బయటకు రాకుండా కట్టడి చెయ్యలేక అధికారులు తీసుకుంటున్న చర్యల పర్యవసానం మానవ జీవితాల మీద తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. ఒక ఊరికి ఇంకో ఊరితో , ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతంతో, ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రంతో ఎప్పటికీ సత్సంబంధాలు ఉండాలి. ఉంటాయి. ఆ అనుబంధాన్ని గోడలు కట్టి, గోతులు తీసి దూరం చెయ్యాలనుకోవటం తప్పు . కరోనా గోడలు కడితే, గోతులు తీస్తే ఆగుతుంది అని భావిస్తే ప్రపంచమే పెద్ద అంతు చిక్కని చైనా వాల్ లా మారుతుంది .
Recommended Video
సామాజిక దూరం పాటించేలా ప్రజలను చైతన్యం చెయ్యటం ఒకటే మార్గం
కరోనా కట్టడికి చెయ్యాల్సింది ఒకటైతే ప్రభుత్వాలు అనుసరిస్తుంది మరొకటి .. ప్రజలను సాధ్యమైనంత చైతన్యవంతం చెయ్యాలి . వారికి అవగాహన వచ్చిన రోజు వారే సామాజిక దూరం పాటిస్తారు . అలా అవగాహన వచ్చేలా చెయ్యాలి కానీ నిర్బంధంగా ఉంచితే దొంగచాటుగా తిరగటానికి మరో మార్గం వెతుక్కుంటారు. కొందరిని ఉద్దేశించి తీసుకుంటున్న చర్యలు, అందరికీ ఇబ్బంది కలిగేలా ఉండకూడదు . ఏది సముచితం అన్న సెన్స్ ఉండాలి . అత్యవసరం అయితే ఎలా అన్న ఒక ఆలోచన కూడా ఉండాలి . అది లేకుంటే మానవ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. కంచె వేసుకున్న జీవితాలు నిర్బంధలోనే ఉండిపోవాల్సి వస్తుంది. దుర్భర పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది.