ప్రభుత్వానికి ట్రబుల్ షూటర్ల అవసరం ...ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్ నియామకంలో ఆంతర్యం అదేనా ?
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలన ప్రస్తుతం కేవలం మూడు నెలలు మాత్రమే, ఈ మూడు నెలల కాలంలోనే వైసిపి ప్రతిపక్షాలను ఎదుర్కోవటానికి చాలా కష్టపడుతోంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వైసీపీ పాలనపై ధ్వజమెత్తుతున్నాయి. మూడు నెలల కాలంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ముందు ముందు పెరిగే ప్రమాదం ఉన్నందున ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీని ప్రతిపక్షాల నుండి కాపాడే , అలాగే పాలన విషయంలో సరైన సలహాలు, సూచనలు ఇచ్చి ముందుకు నడిపించే ట్రబుల్ షూటర్ల కోసం దృష్టి సారించారు.
పారదర్శక పాలన అందించాలన్న ఆశయంతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా అనుభవంతో కూడిన సలహాలు ప్రభుత్వానికి అవసరం అని భావించిన నేపధ్యంలోనే ఆయన ట్రబుల్ షూటర్స్ ఎవరు అన్న దానిపై సీరియస్ గా ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. అందుకే జగన్ అమెరికా పర్యటన ముగించుకుని రాగానే హుటాహుటిన దేవులపల్లి అమర్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మూడునెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు.. జగన్ పాలనపై ప్రతిపక్షాల టార్గెట్
ఏపీలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు జగన్ కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. పోలవరం పనులను నిలిపివేయడం, పోలవరం టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్ళటం , విద్యుత్ పిపిఎలను సమీక్ష చేయటం , ఇక అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధుల విషయంలో రుణాలిస్తామన్న బ్యాంకులు వెనక్కు వెళ్ళటం , వరదల సమయంలో విపత్తు నిర్వహణలో విఫలమవడం మరియు పాత ఇసుక విధానం రద్దు చేయటం , కొత్త పాలసీని ఇప్పటి వరకు అమలు చెయ్యకపోవటం , స్థానికులకు 75 % ఉద్యోగాలు ఇస్తామన్న చట్టంతో పారిశ్రామికంగా పెట్టుబడులు కోల్పోవడం వంటి అంశాలు, తెలంగాణా సీఎం కేసీఆర్ తో స్నేహం, జల వివాదాల పరిష్కారం దిశగా చేస్తున్న ప్రయత్నాలు కూడా నెగిటివ్ గా ప్రచారం అవుతున్నాయి . అలాగే జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్రం సీరియస్ అవటం జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది . దీంతో జగన్ను కార్నర్ చేయడంలో ప్రతిపక్షాలు విజయవంతం కావడమే కాక, జాతీయ మీడియా కూడా వైయస్ జగన్ పరిపాలనలో లోపాలను , జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఏకరువు పెడుతుంది .
ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవటంలో జగన్ సర్కార్ విఫలం .. అసంతృప్తిలో జగన్
ముఖ్యంగా, జగన్ పరిపాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నేపధ్యంలో మీడియా జగన్ పాలనపై ఇస్తున్న కథనాలు సిఎం జగన్ను కలవరపెడుతున్నాయి . జగన్ ప్రభుత్వానికి మీడియా నుండి కూడా గట్టి మద్దతు లభించలేదు. ఇక మంత్రులు మరియు పార్టీ ముఖ్య నాయకులు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టటంలో విఫలం కావటం కూడా జగన్ కు ఆందోళన కలిగిస్తున్న అంశం . ప్రస్తుతం ఏపీలో ఉన్న మంత్రులలో ఎవరూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల విమర్శల దాడి నుండి గట్టిగా రక్షించలేకపోతున్నారు అన్న భావన జగన్ కు ఉంది. జగన్ ఎంతో ఆచి తూచి సెలక్ట్ చేసుకున్న అధికార యంత్రాంగం సైతం పాలనలో ప్రజల మెప్పు పొందేలా పని చేసి చూపించలేకపోతుంది.
ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ నియామకం అందుకే ..
ఇక జాతీయ రాజకీయాల్లోనూ , నేషనల్ మీడియాలోనూ జగన్ తమ పాలనపై సానుకూల దృక్పధం ఉండాలని భావిస్తున్నారు. అందుకే జగన్ ఇటీవల జాతీయ మీడియాను నిర్వహించడానికి దేవులపల్లి అమర్ను నియమించారు. అమర్ కు నేషనల్ మీడియాతో ఉన్న సత్సంబంధాలు తమ పాలనకు ఎంతో ఉపకరిస్తాయని జగన్ భావిస్తున్నారు. అంతే కాదు , తెలంగాణా , ఏపీల మధ్య అంతర్రాష్ట్ర సంబంధాలపైన కూడా అమర్ తగు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇవి ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. కేసీఆర్ విషయంలో జాగ్రత్త అని ప్రతిపక్ష పార్టీలు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపధ్యంలోనే రాజకీయాలను నాలుగు దశాబ్దాలకు పైగా దగ్గర నుండి చూస్తూ , విశ్లేషిస్తూ , చాలా అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ను జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాలపై ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే నాయకులకు స్థానం..ట్రబుల్ షూటర్ల కోసం జగన్ అన్వేషణ
పార్టీ నుండి ట్రబుల్ షూటర్ల కోసం కూడా జగన్ ఆలోచన చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోగలిగే నాయకులకు తగిన స్థానం ఇవ్వాలని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న కొందరు మంత్రుల పనితీరుపైన కూడా జగన్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు ట్రబుల్ షూటర్లు కావాలి . జగన్ తన తదుపరి క్యాబినెట్ విస్తరణలో అలాంటి నాయకులకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు . ప్రస్తుతం మంత్రులుగా చాన్స్ దక్కని నాయకులు జగన్ ఆలోచనలకు తగ్గట్టు ఇప్పటి నుండే పని చేసి జగన్ మెప్పు పొందితే నెక్స్ట్ బెర్త్ మీకే .