పంచాయతీ పోరుపై సై అంటే సై అంటున్న జగన్, నిమ్మగడ్డ- పరస్పరం లేఖలు, గవర్నర్కు ఫిర్యాదులు
ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను దశల వారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వానికి మంటపుట్టిస్తున్నాయి. కరోనా తగ్గినందున వచ్చే ఫిబ్రవరిలో పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ నిన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటనతో ఈ వార్ మొదలైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఇప్పుడు ఎన్నికలేంటని నిమ్మగడ్డకు ఘాటుగా బదులిచ్చారు. దీనిపై స్పందించిన నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ వ్యవహారాల్లో మీ జోక్యమేంటంటూ అంతే దీటుగా ఆమెకు ఎస్మెమ్మెస్ చేశారు.
Recommended Video
పంచాయతీ ఎన్నికల పోరు...
ఏపీలో కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తిరిగి వీటిని నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు మరో మూడు నెలల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ పోరు నిర్వహిస్తామంటూ ఎన్నికల సంఘం ముందుకొచ్చింది.
ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారయంత్రాంగానికి, రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే స్ధానిక ఎన్నికల నిర్వహణపై విముఖంగా ఉన్న ప్రభుత్వం సీఎస్ నీలం సాహ్నీతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు ఓ లేఖ రాయించింది.
నిమ్మగడ్డ లేఖకు బదులిచ్చిన సీఎస్...
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖకు సీఎస్ నీలం సాహ్నీ ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్రంలో ఉన్న కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని సీఎస్ స్పష్టం చేశారు. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాలు పలు వ్యూహాలు రచించాయని, ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చి ఇక్కడి పరిస్దితిని అంచనా వేయడం సరికాదని ఆమె తెలిపారు.
చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని సీఎస్ గుర్తుచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 6890 మంది కరోనాకు బలయ్యారని, మరోసారి కరోనా ప్రబలేలా చర్యలు తీసుకునేందుకు మేం ముందుకు వెళ్లలేమంటూ ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించడం ప్రాణాంతకమని, ఇప్పటికే పాలనా సిబ్బంది, పోలీసులు, వివిధ శాఖలు కరోనా కట్టడికి కృషి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలకు పరిస్ధితులు అనుకూలించగానే ఎస్ఈసీకి సమాచారం ఇస్తామని సీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. దయచేసి ఎన్నికల నిర్వహణపై పునరాలోచన చేయాలని,ఇవాళ కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని భావిస్తున్నామన్నారు.
సీఎస్ లేఖకు ఎస్సెమ్మెస్తో బదులిచ్చిన నిమ్మగడ్డ...
ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ సీఎస్ నీలం సాహ్నీ రాసిన లేఖకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సెమ్మెస్తో బదులిచ్చారు. సీఎస్ రాసిన లేఖ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిప్రత్తిని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్దను కించపరచడమేనని నిమ్మగడ్డ తెలిపారు. సీఎస్ రాసిన లేఖ చట్ట విరుద్ధమని ఎస్ఈసీ పేర్కొన్నారు.
తద్వారా ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని నిమ్మగడ్డ చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన కలెక్టర్లతో ఆయన ఇవాళ పంచాయతీ ఎన్నికలపై నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఎస్ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్కు హాజరైతే ఓ సమస్య, హాజరు కాకపోతే మరో సమస్యలా కలెక్టర్ల పరిస్ధితి మారింది.
గవర్నర్కు నిమ్మగడ్డ ఫిర్యాదు- నేడు భేటీ...
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తాను చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొడుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత స్ధానాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు కల్పిస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్కు రాసిన లేఖలో తెలిపారు.
కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు భయపడుతున్నారని కొందరు వారిలో లేని భయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది అప్రజాస్వామికం, అనైతికం, రాజ్యాంగవిరుద్ధమని నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉద్యోగులను రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆయన గవర్నర్ను కోరారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాల ఏర్పాటు కాకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్కు నేరుగా వివరించేందుకు ఇవాళ నిమ్మగడ్డ గవర్నర్తో భేటీ కానున్నారు.