నిధులేం చేస్తున్నారు, జాగ్రత్త! బాబును అనొద్దు: ఏపీలో టిడిపిXబిజెపి
విజయవాడ: తెలుగుదేశం, బిజెపి మధ్య ఏపీలో స్నేహం కొనసాగుతుందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నప్పటికీ.. ఆ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. తాజాగా, టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బిజెపి నేత కోటేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది.
చంద్రబాబు ప్రభుత్వం పైన బిజెపి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని బుద్ధా వెంకన్న అన్నారు. ఇటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. బిజెపి బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
తాము కేంద్రానికి ఎలా సహకరిస్తున్నామో, ఏపీలోను బిజెపి నేతలు కూడా అదే విధంగా తమ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో బిజెపికి పద్నాలుగు సీట్లు కేటాయిస్తే అందులో నాలుగు సీట్లు మాత్రమే గెలిచారన్నారు. బిజెపిలో ఏపీకి బలం లేదన్నారు.
అంతకుముందు, బిజెపి నేత కోటేశ్వర రావు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి దుష్ప్రభారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.
రాజ్ భవన్, అసెంబ్లీ నిర్మాణానికి కేంద్రం రూ.500 కోట్లు ఇచ్చిందని, ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదన్నారు.
అనవసరమై దుష్ర్పచారంతో రెండు పార్టీలు (టిడిపి, బిజెపి) నష్ట పోతాయన్నారు. నీరు-చెట్టు పథకంలో అవినీతి జరిగిందని, చెరువులను తవ్వే పనులు జన్మభూమి కమిటీలకు అప్పగించడం సరికాదన్నారు. చెరువులను ఎంత తవ్వాలో గ్రామస్తులకే తెలుస్తుందని చెప్పారు.