నీ తండ్రి వల్లే కాలేదు, పిచ్చిపిచ్చి చేస్తే: జగన్పై బాబు, సాక్షి స్టోరీ దుమారం
హైదరాబాద్: నదుల అనుసంధానం పైన ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మంగళవారం నాడు వాడివేడిగా చర్చ సాగింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన రౌడీయిజం ఇక్కడ సాగదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు పైన చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే మీరు ప్రజల్లోకి వెళ్లరని హెచ్చరించారు. వారి వ్యవహార శైలి సభలో ఏమాత్రం బాగాలేదన్నారు. ఇది ఇడుపులపాయ లేదా లోటస్ పాండ్ కాదని, అసెంబ్లీ అని గుర్తుంచుకోవాలన్నారు.
అసెంబ్లీలో ఎవరూ రౌడీయిజం చేయలేన్నారు. నీ తండ్రి వల్లనే రౌడీయిజం సాధ్యం కాలేదని, ఇక నీ వల్ల ఎంత అని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడ నీ ఇష్ట ప్రకారం అంటే జరగదన్నారు. సభలో సభ్యతగా ఉండాలని, దయచేసి కూర్చోవాలని హితవు పలికారు. పోలవరంపై ఇష్టానుసారంగా వచ్చిన కథనంపై జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు.
కాగా, చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ అభ్యంతరం చెబుతూ పోడియంను చుట్టుముట్టింది. చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని నినాదాలు చేశారు.
జగన్ మాట్లాడుతూ.. గోదావరి పొంగేది ఏడాదికి 60 రోజులేనని, 130 రోజులు కాదన్నారు. అనుసంధానం పైన రాయలసీమకు నీరు ఇస్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. స్టోరేజీ కెపాసిటీ లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని జగన్ ప్రశ్నించారు.
బాబు అన్యాయం చేయరు: సూర్యారావు
తమ జిల్లాలకు చంద్రబాబు అన్యాయం చేయరని ఎమ్మెల్యే సూర్యారావు అన్నారు. గోదావరి జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని ప్రతిపక్షం చూడటం ఏమాత్రం సరికాదన్నారు. నీరు వద్దని రాయలసీమ నేతలు చెప్పగలరా అని వర్మ చెప్పారు.
మంత్రులు జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొంగల గురించి మాట్లాడుతారా అని మంత్రులు విమర్శించారు. దోచుకున్న వైయస్ గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం అనుమానాలు నివృత్తి చేసేందుకు తాము సిద్ధమని అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, నదుల అనుసంధానం పైన సభలో గందరగోళం చెలరేగింది. మాటకు మాటతో హీటెక్కిపోయింది. దీంతో సభను వాయిదా వేశారు.
సాక్షి కథనాలపై ఏపీ అసెంబ్లీలో దుమారం
పోలవరం ప్రాజెక్టుపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై శాసనసభలో దుమారం చెలరేగింది. అవాస్తవాలు రాసిన సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేశారు. సాక్షి కథనాలపై జగన్ వివరణ ఇచ్చాకే జగన్ మాట్లాడాలని మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ పెట్టుకున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.