ఉందంటున్న బాబు, లేదంటున్న జగన్- అసలున్నట్లా లేనట్లా- ఎక్కడ చూసినా ఇదే చర్చ...
ఏపీలో కరోనా వైరస్ పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన కరోనా వైరస్ పై మండిపడుతున్న ప్రభుత్వం, లేదని నిరూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కరోనా ఉందని చూపించేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీంతో కరోనా పేరు మీద సాగుతున్న మాటల యుద్ధం కాస్తా చేతల్లోకి మారిపోతోంది.
కరోనాతో ఎన్నికల వాయిదా..
ఏపీలో స్ధానిక ఎన్నికల ప్రక్రియ ఓ రేంజ్ లో హీట్ పుట్టిస్తున్న వేళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా ప్రభావం పేరుతో దాన్ని ఆరువారాల పాటు వాయిదా వేశారు. దీంతో రాజకీయ పార్టీలతో అభ్యర్ధులు కూడా కంగుతిన్నారు. అంతలోనే కోలుకున్న వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. సీఎం జగన్ అయితే ఏకంగా గవర్నర్ హరిచందన్ ను కలిసి ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా సీఎం హోదాలో తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ నిమ్మగడ్డ నిర్ణయాన్ని కడిగేశారు.
కరోనా లేదని నిరూపించేందుకు...
కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో ఉన్న కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటన రాజకీయ దుమారానికి కారణమైంది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్న సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన ఒకే ఒక అనుమాస్పద కరోనా కేసు నెల్లూరు జిల్లాలోనే అని, మిగతా చోట్ల కేవలం అనుమానాలు మాత్రమేనని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కరోనా ఎఫెక్ట్ లేదని చెప్పేందుకు జగన్ ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కరోనా ఉందని చూపేందుకు...
తెరవెనుక కారణాలు ఏవైనా.. కరోనా ఎఫెక్ట్ రాష్ట్రంపై ఉండటం వల్లే ఎన్నికలు వాయిదా పడ్డాయని ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు దాన్ని నిరూపించే పనిలో పడ్డారు. దాదాపు ప్రతిరోజూ ప్రెస్ మీట్లు పెడుతూ కరోనా ప్రభావం ఎక్కడెక్కడ ఉందో, అనుమానితుల వివరాలు చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ కరోనా ప్రభావంతో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు పాటించాల్సిన జాగ్రత్తలను కూడా చంద్రబాబు ప్రకటించారు. దీంతో కరోనా ప్రభావం తీవ్రత ఎంతుందో తెలియచెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఏపీలో అసలు కరోనా ఎఫెక్ట్ ఎంత ?
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్నప్పటికీ వాస్తవంగా గమనిస్తే ఇప్పటివరకూ పూర్తిస్ధాయిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఉన్న వాతావరణ పరిస్దితులు, అంతర్జాతీయ స్ధాయి విమానాశ్రయాలున్నా ప్రయాణికుల రాక లేకపోవడం వంటి కారణాలతో కరోనా ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాలలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఇప్పటివరకూ కేవలం అనుమానిత కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని కారణంగా చూపుతూ సుప్రీంకోర్టులో స్ధానిక ఎన్నికల వాయిదాను వ్యతిరేకించేందుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతోంది.