ఢీ అంటే ఢీ.. సభలోనే తొడ కొట్టిన మంత్రి అనిల్.. మండలిలో హైటెన్షన్..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడిచింది. టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు,మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఇరువురు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ తీవ్ర ఆవేశానికి లోనై సభలోనే తొడ కొట్టారు. ఒకానొక దశలో ఇద్దరు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Recommended Video
బీసీలను అణగదొక్కుతున్నారన్న టీడీపీ...
బడ్జెట్పై చర్చ సందర్భంగా నాగ జగదీశ్వరరావు అచ్చెన్నాయుడు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 300 మంది పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేయించి.. సుదీర్ఘ సమయం ఆయనతో జర్నీ చేయించారని ఆరోపించారు.రాష్ట్రంలో బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. అయితే అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కౌంటర్ ఇచ్చారు. ఇదే విషయంలో జోక్యం చేసుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్... ముద్రగడ పద్మనాభం అరెస్టును గుర్తుచేశారు.
తొడగొట్టిన మంత్రి అనిల్..
టీడీపీ హయాంలో ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తే 3వేల మంది పోలీసులతో ఆయన్ను అరెస్ట్ చేయించలేదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే తనపై కూడా బెట్టింగ్ కేసులు పెట్టి.. చివరకు వాటిని నిరూపించలేకపోయారని అన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన తొడ కొట్టగా.. టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మంత్రి అనిల్,ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ రెడ్డి ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ అనిల్ను నిలువరించగా.. నాగజగదీశ్వర్ రెడ్డిని దీపక్ రెడ్డి నిలువరించారు.
కాక రేపిన 'గడ్డం' కామెంట్స్
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చేసిన 'గడ్డం' కామెంట్స్ కూడా సభలో కలకలం రేపాయి. గడ్డం పెంచిన రౌడీలు సభకు వస్తున్నారని సోషల్ మీడియాలో మంత్రుల గురించి పోస్టులు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి అనిల్... గడ్డం పెంచుకున్నవారందరూ రౌడీలా అని ప్రశ్నించారు. మండలి ఛైర్మన్ షరీఫ్కు గడ్డం ఉంది.. ఆయన రౌడీనా.. చంద్రబాబు నాయుడుకు గడ్డం ఉంది.. ఆయన రౌడీనా...? అంటూ ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
మండలికి మరోసారి బిల్లులు...
బుధవారం(జూన్ 17) మండలిలో సీఆర్డీఏ రద్దు బిల్లు,పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పటికే ఒకసారి సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లులను మళ్లీ మండలిలో ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్దమని టీడీపీ వాదిస్తోంది. అయితే సెలెక్ట్ కమిటీకి పంపించినట్టు ఎక్కడా నిర్దారణ లేదు కాబట్టి.. మరోసారి మండలిలో బిల్లులను ప్రవేశపెట్టడంలో తప్పు లేదని అధికార వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో సభలో వ్యవహారించాల్సిన తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలతో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అటు టీడీపీ ఎమ్మెల్సీలతో యనమల రామకృష్ణుడు చర్చిస్తున్నారు. అవసరమైతే రూల్.90 కింద ఓటింగ్ పట్టుబట్టాలని యనమల సూచిస్తున్నారు.