కాంగ్రెస్ ను బ్రతికించేందుకు చంద్రబాబు యత్నం:సోము వీర్రాజు;వాళ్లు ఆంధ్రా ద్రోహులు:బుద్దా వెంకన్న
న్యూఢిల్లీ:ఊసరవెల్లి రాజకీయాలను నడపడంలో చంద్రబాబు మించినవారు లేరని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభివర్ణించారు.ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తిని కాంగ్రెస్లోకి పంపి తెలంగాణలో కాంగ్రెస్ను బతికించేందుకు ఆయన ప్రయత్నం చేయడమే అందుకు నిదర్శనం అన్నారు.
మంగళవారం ఢిల్లీలో పలువురు బీజేపీ ఆగ్రనేతలను కలిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్, ఇళ్ల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణంలోనూ అవినీతే అని ఆరోపించారు. అయితే చంద్రబాబు అవినీతికి చరమగీతం పాడబోతున్నామని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. మరోవైపు విజయవాడలో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి ముసుగులో ముగ్గురు ఆంధ్రా ద్రోహులు తయారయ్యారని విమర్శించారు.
ఎన్టీఆర్ ఆశయాలు...కాలరాస్తున్న బాబు
కాంగ్రెస్ ను బ్రతికించాలనే ప్రయత్నం ద్వారా చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతిమయమైన కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కాలరాసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సోమువీర్రాజు అన్నారు.
చంద్రబాబు పాలనకు...చరమగీతం
దగాకోరు ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వ అవినీతికి బీజేపీ చరమగీతం పాడబోతుందని స్పష్టం చేశారు. పోలవరం, టాయిలెట్ల నిర్మాణం, పేదలకు కట్టించే ఇండ్లల్లో 30 వేల కోట్లతో అవినీతికి పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాల కంటే ఏపీకి అదనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తుందన్నారు. 2019లో చంద్రబాబు రాజకీయం అంతం అవుతుందని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. బీజేపీలో కోవర్టులుండరు...కేవలం దేశ భక్తులు మాత్రమే ఉంటారని చెప్పారు.
బిజెపి ముసుగులో...ముగ్గురు ద్రోహులు
మరోవైపు మంగళవారం విజయవాడలో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి ముసుగులో ముగ్గురు ఆంధ్రా ద్రోహులు తయారయ్యారని విమర్శించారు. కన్నా, జీవీఎల్, సోము వీర్రాజు ఆంధ్రా ప్రజల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. జీవీఎల్ సర్వేల పేరుతో మోదీకి దగ్గరై ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
కన్నా ఆస్తులపై...సవాల్
అవినీతి కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న కన్నా లక్ష్మీనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నైజం కన్నాదని వ్యాఖ్యానించారు. ఆస్తులపై కన్నా బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయనకు సవాల్ విసిరారు. ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.