చినరాజప్ప-హర్షకుమార్ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
రాజమండ్రి:టిడిపి నిర్వహించిన దళిత తేజం కార్యక్రమంపై హోంమంత్రి చినరాజప్ప...మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం చినరాజప్ప తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు హర్షకుమార్ కౌంటరిచ్చారు.
Recommended Video
కాంగ్రెస్ హయాంలో దళిత సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదోవ పట్టించిన సంగతి హర్షకుమార్ తెలుసుకోవాలని చినరాజప్ప వ్యాఖ్యానించగా, పదేళ్ల కాంగ్రెస్ హయాంలో దళితులకు జరిగిన మేలుపై రాజప్పతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని హర్షకుమార్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించామన్నారు.
టిడిపి దళిత తేజం కార్యక్రమంపై హర్షకుమార్ విమర్శలపై స్పందించిన హోం మంత్రి చినరాజప్ప ఆయనపై మండిపడ్డారు. దళిత తేజం నిర్వహించే అర్హత టీడీపీకి లేదన్న హర్షకుమార్ కు...దళితుల గురించి మాట్లాడేందుకు ఆయనకు ఏ అర్హత ఉందని చినరాజప్ప ప్రశ్నించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ నిధులను ఇతర పనులకు మళ్లిస్తే హర్షకుమార్ ఏం చేశారని నిలదీశారు.
దీంతో తనను ఉద్దేశించి చినరాజప్ప చేసిన వ్యాఖ్యలపై హర్షకుమార్ ఘాటుగా ప్రతిస్పందించారు. దళితులకు 40 వేల కోట్లు కేటాయించామని గొప్పగా చెబుతున్న టిడిపి...ఆనాడు తాము చేసిన చట్టంవల్లే ఆ విధంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని హర్షకుమార్ చెప్పారు. దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోన్న టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు.